చండీఘడ్: తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫేక్ వీడియోలను వినియోగిస్తున్నారని పంజాబ్ సీంఎ భగవంత్ సింగ్ మాన్(CM Bhagwant Singh) అన్నారు. ఇక రాజకీయ లబ్ధి కోసం తనపై మతపరమైన ఆదేశాలను జారీ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. మద్యం సేవిస్తూ.. సిక్కు మతగురువుల ఫోటోలపై సీఎం భగవంత్ మద్యం చల్లుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఆ వీడియో నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ పంజాబ్ సీఎంపై తీవ్ర విమర్శలు చేశాయి. తక్షణమే ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాను ఉద్దేశించి సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. ప్రజల మెదళ్లలో తన పట్ల ద్వేషం కలిగేలా విపక్షలు ప్రయత్నిస్తున్నాయని, కానీ వాళ్లు ఆ ప్రయత్నంలో సఫలం కాలేరని ఆయన అన్నారు.
మతపరంగా తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. గురుద్వారాల ముందు తనకు వ్యతిరేకంగా శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీలు బోర్డులు ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అకాల్ తక్త్ ముందు ఎన్ని సార్లు అయినా హాజరయ్యేందుకు వెనుకాడబోనన్నారు. అకాల్ తక్త్ ముందు హాజరైనప్పుడు దాన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ చేయాలని కోరారు. కానీ అలా కాకుండా క్లిప్లను రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం తాగుతున్న వైరల్ క్లిప్లో ఉన్నది తాను కాదు అని సీఎం మాన్ అన్నారు.
కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఆ క్లిప్ను తయారు చేసినట్లు సీఎం మాన్ ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తి తన ముఖానికి మాస్క్ వేసుకుని ఆ వీడియో తీసినట్లు ఆరోపించారు. తన మెడపై ఓ మచ్చ ఉంటుందని, చిన్నప్పుడు తనకు సర్జరీ అయ్యిందని, కానీ ఆ వీడియోలో మెడపై మచ్చ లేదని సీఎం మాన్ పేర్కొన్నారు. ఓ హోటల్ రూమ్లో గురు సాహిబ్ ఫోటోను ఎవరైనా పెట్టుకుంటారా అని కూడా మాన్ అన్నారు.