ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందా ల జలపాతం హోగెనక్కల్. దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించని ఈ జలపాతానికి కి.మీ. దూరంనుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది. దగ్గరికీ వెళ్లాక మనల్ని మనమే మర్చిపోతాం. భారతీయ నయాగరా జలపాతంగా పిలిచే ఈ జలపాతం అందాలను వానాకాలంలో చూసిన వారెవ్వరైనా ఆనందంతో తడిసిముద్దయిపోతారు. ఈ వానకాలం తప్పకుండా సందర్శించాల్సిన అందాల విడిది హోగెనక్కల్ వాటర్ పాల్స్ మీకోసం.
హొగెనక్కల్ జలపాతం కావేరీ నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది.. ఇది తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంటుంది. బెంగళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరం లో ఉంటుంది. కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలో, ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. వానకాలంలో ఈ జలపాతం అందాలను చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. జలపాతం నుండి జాలువారే నీరు రాళ్ళమీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంటుంది. కన్నడంలో హొగె అనగా పొగ, కల్ అంటే రాయి కలిపి హొగెనక్కల్ అంటే పొగలు చిమ్మే రాయి లేదా మంచు తుంపరల నుండి వచ్చే శబ్దం అని అర్థం.
నిజానికి ఇక్కడ ఉన్నది ఒక జలపాతం కాదు. అనేక జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తాయి ఈ వాటర్ ఫాల్స్. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలలో తలకావేరి వద్ద జన్మించిన కావేరీ నది తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది. కొండ వాలులో ప్రవాహ వేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది. హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండ చరియల మీదు గా కిందికి జారుతూ.. జలపాతాల సమూహాంగా కొండలపైనుంచి జాలువారుతూ ఆకట్టుకుంటాయి. ఒకే కొండ రెండుగా మధ్యకు నిలువునా చీలి రెండు కొండలను తలపిస్తుంది.
హొగెనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో చేసే మర్దనతో కీళ్లనొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటారు. వేలాదిమంది ఈ జలపాతం కింద జలకాలాడుతారు. దానికనుగుణంగా ఇక్కడ వంతెనలు ఏర్పాటు చేశారు. ఇక్కడి స్థానికులకు ఆయుర్వేద తైలాల తయారీ ఓ కుటీర పరిశ్రమ.
హొగెనక్కల్ ట్రిప్లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే వారిలో చాలామంది ఈ చేపల రుచిని ఆస్వాదిస్తారు. జలపాతం హోరులో జలపుష్పాలను ఆరగిస్తుంటే.. ఆ రుచి మరెక్కడా లభించదనిపిస్తుంది. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.
బెంగళూరు నుండి ఉదయం బయలు దేరి రాత్రికి తిరిగి బెంగళూరు చేరితే ట్రిప్ థ్రిల్గా ఉంటుంది. బెంగళూరులో బయలు దేరినప్పటి నుండి ఎంజాయ్మెంట్ మొదలైనట్లే. సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి. రోడ్డుకు రెండు వైపులా పచ్చటి మల్బరీ తోటలుంటాయి. ఇక్కడ పట్టుపురుగుల పెంపకం కేంద్రాలు ఎక్కువ. వెడల్పాటి ఆకులను సన్నగా కత్తిరించి పురుగులకు ఆహారంగా వేస్తుంటారు. తీసేవాళ్ళు హొగెనక్కల్ను రొమాంటిక్ పాటలు తీయడానికి ఎన్నుకుంటారు.
ఎండాకాలంలో నీరు ఎక్కువగా లేని సమయంలో ఈ జలపాతంలో తెప్పలపై పయనిస్తారు. వానాకాలంలో నిపుణులైన మత్స్యకారుల సహాయంతో తెప్పల విహా రం ఉంటుంది. అత్యంత సాహసంగా సాగే ఈ క్రీడలో వెదురు బద్దలతో తయారు చేసిన ఒక చిన్న బోటును ఉపయోగిస్తారు. హంపి సందర్శనకు వచ్చిన పర్యాటకులు నదిలో తెప్ప ప్రయాణం చేస్తారు. నదిలో తెప్పపై పయానిస్తూ.. హంపి శిలలను చూడడం అద్భుతమైన అనుభూతి. అలల తాకిడి ఎక్కువగా ఉన్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా.. బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకోవడం సులభం. బెంగళూరు వరకు విమా నం, రైలు మార్గాల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం 180 కి.మీ. ఈ ప్రాంతానికి 115 కి.మీ దూరం లో ఉన్న సేలం వరకు రైలు మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుంచి టాక్సీలో, బస్సులో హోగెనక్కల్ చేరుకోవచ్చు. బెంగళూరు నుండి 4గంటల్లో, చెన్నై నుంచి 6 గంటల్లో, సేలం నుంచి 2 గంటల్లో, ధర్మపురి నుంచి గంటలో చేరుకోవచ్చు. రోడ్డుకు రెండు వైపులా పచ్చటి తివాచీ పరిచినట్లుగా మల్బరీ తోటలు ఉంటాయి.