హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ ఐశ్వర్యరెడ్డి కుటుంబానికి పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. ఆమె కుటుంబసభ్యులకు రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, మరోసారి మానవీయతను చాటుకొన్నారు. ప్రభుత్వం తరపున షాద్నగర్లో డబుల్బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకొంటూ, సివిల్స్ కోచింగ్ పొందుతున్న ఐశ్వర్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడింది. గత ఏడాది నవంబర్లో హాస్టల్ ఫీజు చెల్లించలేక, ఆన్లైన్ క్లాసుల కోసం ల్యాప్టాప్ కొనుక్కొనే స్థోమతలేక తల్లడిల్లిపోయిన ఆమె కాలేజీ హాస్టల్లోనే ప్రాణాలు విడిచింది.
ఐశ్వర్య కుటుంబసభ్యుల పేదరికం గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గురువారం వారిని ప్రగతిభవన్కు ఆహ్వానించారు. పేదరికాన్ని అనుభవిస్తూ దేశంలోనే ప్రముఖ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చూపిన ఉదారత పట్ల ఐశ్వర్యరెడ్డి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డను కోల్పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోని తమ కుటుంబానికి మంత్రి చేసిన సహాయం గొప్ప నైతిక బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కేటీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఉద్వేగానికి లోనయ్యారు.