హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బాలిక సామూహిక లైంగిక దాడి ఘటనలో కేసు నమోదైన గంటల్లోనే నిందితులను గుర్తించామని వెస్ట్జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని.. ఆమెను భరోసా కేంద్రానికి పంపామని చెప్పారు. మహిళా అధికారులు కౌన్సెలింగ్తో భరోసానివ్వటంతో.. ఘటనపై నోరు విప్పిందని వివరించారు. అనంతరం కేసును ఐసీపీ సెక్షన్ 354ను 376(డీ)గా మార్చి, మరికొన్ని సెక్షన్లు నమోదు చేశామని వెల్లడించారు. ఘటన జరిగి అప్పటికే 4 రోజులు కావటంతో బాధితురాలు నిందితుల వివరాలు చెప్పలేకపోయిందని తెలిపారు.
నిందితుల్లో ఒకరి పేరు చెప్పటంతో, సీసీటీవీ ఫుటేజీ, బాధితురాలి స్టేట్మెంట్, సీడీఆర్ విశ్లేషణను ప్రతి నిమిషం పోల్చుతూ ఐదుగురిని గుర్తించామని అన్నారు. అందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకడైన పుప్పాలగూడకు చెందిన సాధుమాలిక్ను 48 గంటల్లోనే అరెస్టు చేశామని తెలిపారు. మరో నిందితుడిని గుర్తించామని, అయితే జువైనల్ను రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకురావొద్దనే నిబంధనతో ఆగామని, అతడిని శనివారం అరెస్టు చేస్తామని వెల్లడించారు.
మిగతా నిందితుల్లో 18 ఏండ్లు నిండిన వ్యక్తి పేరు ఉమేర్ఖాన్ అని, మిగతావారు జువైనల్ అయినందున వారి పేర్లు చెప్పలేమని అన్నారు. 48 గంటల్లోగా మిగతావారినీ అరెస్టు చేస్తామని చెప్పారు. కేసు దర్యాప్తును ఏసీపీ స్థాయి అధికారికి అప్పగిస్తామని తెలిపారు. బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఆమె కోలుకొన్నాక మరిన్ని వివరాలు సేకరించి ఇంకెవరైనా బాధ్యులుంటే వారినీ పట్టుకొంటామని స్పష్టం చేశారు.
లైంగిక దాడి ఘటనలో హోం మంత్రి, బహదూర్పురా ఎమ్మెల్యే కుటుంబసభ్యుల పాత్ర ఉన్నదన్న ఆరోపణలను డీసీపీ ఖండించారు. ‘హోం మంత్రి మనుమడు ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిరాధార ఆరోపణ. అన్ని సీసీటీవీ పుటేజీలను విశ్లేషించాం. వారి స్నేహితుల మధ్య తీసుకొన్న ఫొటోలు సేకరించాం. ఇన్ని ఆధారాలు విశ్లేషించిన తర్వాత కూడా హోంమంత్రి మనుమడు ఉన్నాడని చెప్పటం బాధాకరం. నిరాధారమైన ఆరోపణలతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది.
స్వీయ లాభం కోసం నిరాధార ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకొంటాం. ప్రముఖ వ్యక్తి కొడుకు ఉన్నట్టు సమాచారం ఉన్నది. ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు ఆధారాలు లేవు’ అని తెలిపారు. పబ్లో ఏం జరిగిందనే విషయంపై దృష్టి పెడతామని, పబ్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని తెలిపారు. పార్టీలో ఎవరూ ఆల్కహాల్ తీసుకోలేదని ప్రాథమికంగా తెలిసిందని పేర్కొన్నారు.