న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో పౌరవిమానయాన మంత్రిగా పనిచేసిన హర్దీప్ సింగ్ పూరికి కీలక పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖను అప్పగింంచారు. హర్దీప్ సింగ్ గురువారం నూతన శాఖ బాధ్యతలను చేపట్టారు. పెట్రోల్ ధరలు లీటర్కు రూ 100 దాటి పరుగులు పెడుతున్న వేళ నూతన పెట్రోలియం మంత్రిగా హర్దీప్కు పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. పెట్రో సెగల ప్రభావంతో నిత్యవసరాల ధరలు చుక్కలు చూస్తున్న వేళ ధరల నియంత్రణ దిశగా పెట్రో ఉత్పత్తుల హేతుబద్ధీకరణ సంక్లిష్టంగా మారింది.
1974 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన హర్దీప్ ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ముడిచమురు, సహజవాయువును దేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తామని ఆయన చెబుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సహజవాయు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కట్టుబడతామని పేర్కొన్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు పెట్రోలియం మంత్రిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ నూతన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి అభినందనలు తెలిపారు.