హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అద్భుతంగా ఉన్నదని కేంద్ర సామాజిక, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ ఆఠవలే కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల కోసం అధ్యయనం, పరిశోధనలకు కోట్లు వెచ్చించి ప్రత్యేక భవనం నిర్మించడం గొప్ప విషయమని అభినందించారు. సోమవారం ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దళిత్ స్టడీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టడీ సెంటర్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య గతంలో తనను కలిసినప్పుడు ఈ సెంటర్ గురించి చెప్పారని, ఆ ఆసక్తితోనే సందర్శించడానికి వచ్చానని చెప్పారు.
ఈ సెంటర్ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు స్టడీ సెంటర్ ప్రత్యేకతల గురించి మల్లేపల్లి లక్ష్మయ్య కేంద్ర మంత్రికి వివరించారు. దళితుల సామాజిక జీవనానికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలు చేయడానికి, అవసరమైన అత్యాధునిక లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్ తరహాలో సెంటర్లో ఆడిటోరియాన్ని నిర్మించామని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తితోపాటు, జైభీమ్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.