హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించారు. వీటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికై శంకుస్థాపన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వరంగల్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్.బి. నగర్, గడ్డి అన్నారం, అల్వాల్ లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
పటాన్ చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కేబినెట్ మంజూరు చేసింది. అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను ఇక నుంచి ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ ( TIMS ) గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ వైద్యాధికారులను ఆదేశించింది.