హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్నాటకలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ రుతుపవనాలు ముందుకు సాగుతాయని చెప్పింది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా తీరంలోని ఉత్తర కేరళ, కర్నాటకల నుంచి తమిళనాడు, కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని తెలిపింది.
రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. వాతావరణంలో వస్తున్న మార్పులతో జూన్ 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది. సోమవారం 14 జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల 3.20, గుబ్బగుర్తి 2.63 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
మరో వైపు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టాయి. 28 జిల్లాల్లో 40డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో 39 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 7 జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. రామగుండం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా ఎస్ల తక్కలపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.