నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పట్టణ వాసులు గుమిగూడకుండ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బోధన్ బంద్కు బీజేపీ పిలుపునివ్వడంతో ఆందోళనకారులను ముందస్తుగా అరెస్టు చేశారు.
శివాజీ విగ్రహాన్ని నెలకొల్పిన అంబేద్కర్ చౌరాస్తాలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు ఎవరూ రాకుండా రహదారిలో పోలీసులు అడ్డుకుని, వాహనదారులను వెనక్కి తిప్పి పంపుతున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు.