హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్నట్టు.. కేంద్రంలోని మోదీ సర్కారు లాభాల్లో ఉన్న కంపెనీలను అమ్మేస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నది. దేశ ఉత్పత్తి రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ, దేశానికే గర్వకారణంగా నిలుస్తున్న మహారత్న, నవరత్న, మినీ రత్న కంపెనీలను సైతం విక్రయానికి పెడుతున్నది. అయితే ఇవి ఎయిర్ఇండియా మాదిరి రూ.వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయినవి కాదు. ప్రభుత్వానికి ఆదాయం తెస్తూ లాభాల్లో నడుస్తున్న కంపెనీలు. దాదాపు 90 శాతం కంపెనీలు లాభాల్లో ఉన్నా, ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా, తమకు అవసరం లేదని, వాటిని ప్రైవేట్కు అమ్మేస్తామని కేంద్రం స్వయంగా లోక్సభలో పేర్కొన్నది. మొత్తంగా 2016 నుండి ఇప్పటి వరకు 35 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతులు ఇచ్చినట్టు లోక్సభ సాక్షిగా కేంద్రం పేర్కొన్నది.
83 కంపెనీలు లాభాల్లోనే
ప్రస్తుతం దేశంలో మహారత్న, నవరత్న, మినీరత్న మొత్తం 98 కంపెనీలు ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఇందులో 83 కంపెనీలు లాభాల్లో ఉన్నాయని ఇటీవల కేంద్రమే స్వయంగా లోక్సభలో వెల్లడించింది. ఇప్పటికే 25 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభించింది. ఒక మహారత్న, ఒక నవరత్న, ఆరు మినీరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తయినట్టు లోక్సభలో కేంద్రం ప్రకటించింది. మరో 17 కంపెనీల ప్రైవేటీకరణ కొనసాగుతున్నట్టు తెలిపింది.
వీటితోపాటు ఎయిర్ ఇండియా, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తయిందని తెలిపింది.
హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, స్కూటర్స్ ఇండియా, హిందుస్థాన్ ప్రీఫాబ్ లిమిటెడ్, సీసీఐకి చెందిన పలు యూనిట్లు, హిందుస్థాన్ యాంటిబయాటిక్స్ లిమిటెడ్, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్లో పెట్టుబడుల ఉపసంహరణ వివిధ దశల్లో ఉన్నట్టు వివరించింది.
ఒక్కటీ స్థాపించలేదు!
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ రంగంలో 300కుపైగా సంస్థలు ఏర్పాట య్యాయి. ఇందులో అత్యధికంగా నెహ్రూ హయాంలో 38, ఇందిరాగాంధీ హయాంలో 66, రాజీవ్గాంధీ కాలంలో 16, పీవీ నరసింహారావు హయాంలో 14, వాజపేయి హయాంలో 17, మన్మోహన్సింగ్ హయాంలో 7 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రధాని మోదీ హయాంలో ఒక్క సంస్థ కూడా ఏర్పాటు కాలేదు. కానీ, ఆరేండ్లలో 36 సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు.
కేంద్రం వెనక్కి తగ్గాలి:కోలేటి దామోదర్
దేశంలోని నవరత్న, మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ఆందోళన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్ముతున్నామని చెప్పిన కేంద్రం, ఇప్పుడు లాభాల్లో ఉన్న సంస్థలను సైతం ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచమంతా ఆర్థికమాంద్యం తాండవించిన దశలోనూ మన ఆర్థిక పునాదులు పదిలంగా ఉండటానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలే కారణమని గుర్తుచేశారు. కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగం పెరిగి, సామాన్యులు ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలను విక్రయించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.