హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నీటి దోపిడీకి సమైక్యపాలకులు చేసిన కనిపించని కుట్రల్లో చెరువుల విధ్వంసం ఒకటి. పడ్డ వాన బొట్టు ఎక్కడా నిలువకుండా, వాగులు, వంకల ద్వారా నదుల్లోకి.. ఆపై ఆంధ్రాకు చేరాలన్నదే వాళ్ల అంతిమలక్ష్యం. ఈ కారణంగానే నాడు చెరువులను నిర్లక్ష్యం చేశారు. స్వరాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. మిషన్ కాకతీయ ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించాలని నిర్ణయించారు. 20 వేలకుపైగా చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 10 వేలకు పైగా అనుసంధానించి నదీ జలాలతో నింపుతున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగి, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి చెంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టే కీలకం..
చెరువులను నింపడంలో సీఎం మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టే కీలకభూమికను పోషిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారీ జలాశయాలను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను ముడిపెట్టారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ రావడమేగాక వాటికింద ఉన్న చెరువులను కూడా అనుసంధించి నీటితో నింపుతున్నారు. వరంగల్ జిల్లాలోని కాకతీయుల కాలంనాటి రామప్ప, లక్నవరం, పాకాల వంటి జలాశయాలను దేవాదులలో భాగం చేశారు. ఖమ్మం జిల్లాలో సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతల.. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వాటి పరిధుల్లోని చెరువులను ఏడాది పొడవునా నింపుతున్నారు. ఫలితంగా సాగు విస్తీర్ణంలో రికార్డు నమోదు చేస్తుండటమే కాకుండా గ్రామీణ ఆర్థిక పరిపుష్ఠికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారు.
చెరువుల కింద రెండు పంటలకు భరోసా..
మేజర్, మీడియం ప్రాజెక్టులను అనుసంధానించడంతో చెరువుల కింద రెండు పంటల సాగుకు పూర్తి భరోసా లభిస్తున్నది. వాస్తవంగా తెలంగాణలోని 46,571 చెరువుల కింద 25,92,437 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు ఉన్నది. కానీ, సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో అది క్రమేణా తగ్గుతూ వచ్చింది. 2008-09 నుంచి ఏడాదికి సరాసరి 5-6 లక్షల ఎకరాలకు మించి సాగుకాని దుస్థితి. అదీ సమృద్ధిగా వర్షాలు కురిసిన సందర్భాల్లోనే. తెలంగాణ ప్రభుత్వం 2015లో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 27,625 చెరువులను పునరుద్ధరించగా, వాటి కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. పూడికతీత ద్వారా 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరగగా, ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. అదే సమయంలో చెరువులను ప్రాజెక్టులకు లింక్ చేయడం వల్ల ఆయకట్టుకు పూర్తి భరోసా లభించింది. ఈ ఏడాది ఏకంగా 18 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుండటం విశేషం.