రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల దానిని కూల్చి వేశారు. దీంతో పాఠశాల సామగ్రిని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఇటీవలే, గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు కాగా, అక్కడ ఉన్న ఓ చిన్న గదిని దాని కోసం కేటాయించారు.
ప్రీ ప్రైమరీకి మంజూరైన సామగ్రి, వంట సామగ్రిని అందులో భద్రపర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో, ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులకు తరగతి గదుల్లేకుండాపోయాయి. దీంతో హనుమాన్ ఆలయం ఆవరణలోని రేకుల షెడ్డు కిందే విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరారు.