JEE Advanced | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. అమ్మాయిల క్యాటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థిని నాయకంటి నాగభవ్యశ్రీ టాపర్గా నిలిచింది. తొలి టాప్10 ర్యాంకులను ఆరుగురు హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులే దక్కించుకోవడం విశేషం. ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 4న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఆదివారం ఐఐటీ గువాహటి విడుదల చేసింది. మొదటి ర్యాంకు సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డికి 360 మార్కులకు 341 మార్కులు వచ్చాయి.
మహిళల విభాగంలో మొదటి ర్యాంకు పొందిన నాగభవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకును కైవసం చేసుకొన్నది. క్యాటగిరీ వారీగా ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తా చాటారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ టాపర్గా వై ఫణి వెంకట మణీందర్రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ టాపర్గా దాసరి సాకేత్నాయుడు, ఎస్టీ కోటా ఆలిండియా టాపర్గా దీరావత్ తనూజ్, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ టాపర్గా అశిష్కుమార్లు నిలిచారు. కాగా, ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ (జోసా) కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ర్టాల విద్యార్థులు హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నారు.
ఈ ఏడాది అడ్వాన్స్డ్ ఫలితాలలో క్వాలిఫై అయిన అత్యధికుల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే ఉన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1,89,744 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో 1, 80,372 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 43,773 మంది విద్యార్థులు అర్హత సాధించగా, వీరిలో 7,509 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఒక్క హైదరాబాద్ జోన్ నుంచే 10,432 (24%) మంది అర్హులయ్యారు. ఇక టాప్500 ర్యాంకర్లలో హైదరాబాద్ జోన్ విద్యార్థులు 174 మంది ఉంటే, టాప్ -400లో 149, టాప్300లో 121 మంది విద్యార్థుల చొప్పున హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులుండటం విశేషం.
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య నిరుటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గతేడాది 40,712 మంది క్వాలిఫై అవ్వగా, ఈ ఏడాది 43,773 మంది క్వాలిఫై అయ్యారు. కామన్ ర్యాంకు లిస్ట్ (సీఆర్ఎల్) కూడా కటాఫ్ పెరిగింది. గతేడాది ఈ కటాఫ్ 15.28 శాతమే ఉండగా, ఈసారి 23.89కి చేరుకున్నది. సామాజిక వర్గాల వారీగా కటాఫ్ శాతం కూడా పెరిగింది.
మా స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు. తండ్రి నాగేంద్రకుమార్, తల్లి ఇంద్రలత ఇద్దరూ టీచర్లు. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు వస్తుందని ఊహించా. కాని, ఆలిండియా ఫిమేల్ టాపర్గా ఉంటాననుకోలేదు. రోజుకు 12 నుంచి 13గంటలు కష్టపడ్డా. చాలా ప్రశాంతంగా.. టెన్షన్ పడకుండా ప్రిపేరయ్యా. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరుతా. గణితంలో రిసెర్చ్ చేసేందుకు ప్రయత్నిస్తా. 8వ తరగతి నుంచి నుంచి ఇంటర్ వరకు నారాయణ విద్యాసంస్థల్లోనే చదివాను.
– నాగభవ్యశ్రీ, ఆలిండియా ఫిమేల్ టాపర్
నాకు అడ్వాన్స్డ్లో 360 మార్కులకు 324 మార్కులొచ్చాయి. అమ్మ హరిణి గృహిణి. నాన్న శ్రీనివాస్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడ్డా. మాక్ టెస్ట్లు రాయడంతో ఎగ్జామ్ సమయంలో టెన్షన్ అనిపించలేదు. లెక్చరర్లు చెప్పిన టిప్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో 9వ ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరుతా. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రిసెర్చ్ చేసేందుకు ప్రయత్నిస్తా. మంచి ఆవిష్కరణలు రూపొందిస్తా.
– నాగిరెడ్డి బాలాజీరెడ్డి, 9వ ర్యాంకు
హైదరాబాద్లోని మదీనగూడలో నివాసం. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ అకౌంటెంట్. జేఈఈ కోసం రోజుకు 12 గంటలు కష్టపడ్డా. కుటుంబ సభ్యులు, ఫ్యాకల్టీ అంతా అండగా నిలిచారు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరుతా. ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా రిసెర్చ్ రంగంలో రాణిస్తా. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా.
– బిక్కిన అభినవ్ చౌదరి,7వ ర్యాంకు