ఆదివాసీ గూడెంలో పుట్టాడు. అడవిలో పెరిగాడు. పోరులో నిలిచాడు. ఎప్పుడూ గెలిచాడు. గురితప్పని విలుకాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు. బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టి, సామాన్యుల ఆకలితీర్చాడు. నలుగురి కోసం ఉరికంబం ఎక్కి, ఆనాడూ, ఈనాడూ ఆదివాసీలకు ఆరాధ్యుడయ్యాడు. ఇండియన్ రాబిన్ హుడ్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు తంతియా భిల్.
తంతియా బ్రిటిష్ ఇండియా, సెంట్రల్ఫ్రావిన్స్లోని పంధాన తహసిల్ బడాద గ్రామంలో 1842లో పుట్టాడు. ఇప్పుడీ గ్రామం మధ్య ప్రదేశ్ రాష్ర్టంలో ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉ్యదమించాడు. స్వయం పాలన కోసం తిరుగుబావుటా ఎగురవేశాడు.రాజుల సంపదను రాళ్లపాలు కాకుండా ప్రజలపరం చేసిన యోధుడు తంతియా భిల్. పన్నెండేళ్లపాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాం చేశాడు. తంతియా పథకం ప్రకారం ప్రభుత్వ కోశాగారాల మీద దాడి చేసేవాడు. ఖజానాను కొల్లగొట్టేవాడు. సంపన్నులకు రక్షణగా ఉన్నవారిని భయపెట్టి దోచుకునేవాడు. తంతియా దోచిన సొత్తుని పేదలకు పంచేవాడు. ఆపదలో ఉన్న వాళ్ల అవసరాలు తీర్చి అందరికీ చేరువయ్యాడు. తంతియాని నిరుపేదలు దేవుడిలా చూసేవాళ్లు. ఆదివాసులు ప్రేమతో ‘మామ’ అని పిలిచేవాళ్లు.
అస్తమించిన వీరుడు
వారసత్వ విలువిద్యలోనే కాదు గెరిల్లా యుద్ధ తంత్రంలోనూ ఆరితేరాడు. తుపాకీ కాల్చడం నేర్చాడు. అతని దాడులకు తట్టుకోలేక బ్రిటిష్ అధికారులు హడలిపోయేవారు. ఎలాగైనా బ్రిటిష్ పాలకులకు గుణపాఠం చెప్పి, భిల్ తెగ స్వప్నమైన సమసమాజాన్ని సాకారం చేయాలని కలలు కన్నాడు. బ్రిటిష్ పోలీసులపైనా,హోల్కర్సైనికులపైనా దాడులు చేసి తరిమికొట్టాడు. తంతియాకు సహకరిస్తున్నారని వేలాది మందిని అరెస్టు చేసినా, వందలమందిని జైళ్లకు పంపినా ఆయన జాడ దొరకలేదు. ఎన్నో దాడులు చేసి చాకచక్యంగా తప్పించుకున్న తంతియా చివరికి తన సోదరి భర్త చేసిన ద్రోహానికి పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు చిత్రహింసలుపెట్టి జబల్పూర్ జైలుకు పంపారు. కోర్టు తంతియాకి మరణశిక్ష విధించింది. 4 డిసెంబరు 1889న తంతియాని ఉరి తీశారు.
రైలు వందనం
భిల్ల నుంచి ప్రతికార దాడులు జరుగుతాయన్న భయంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మతదేహాన్ని ఆదివాసీలకు అప్పగించలేదు. ఇండోర్కు దగ్గర్లో ఉన్న పాతాల్పానీ రైల్వే స్టేషన్ దగ్గర ఖాండ్వా రైలు మార్గంలో అతని మత దేహాన్ని విసిరేశారు. ఆ ప్రదేశంలో స్మారక కొయ్యలను ఉంచి తంతియాని నేటికీ ఆరాధిస్తున్నారు. ఆ అమరుడికి గౌరవ సూచకంగా ఆ మార్గంలో వెళ్లే రైళ్లను ఒక్క నిమిషంపాటు అక్కడ ఆపడం ఇప్పటికీ ఆనవాయితీ!