‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అని చాటిన కాలంలో ‘స్వరాజ్ జెండా’ కోసం ప్రాణాలర్పించిన చరిత్ర విదురాశ్వత్థ గ్రామానిది. నినదించడమే నేరమైన చోట చట్టాలను ధిక్కరించిన సత్యాగ్రహులంతా ఇక్కడ ఒక్కటయ్యారు. నిరాయుధులైన సత్యాగ్రహులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకీగుండ్లు 32 ప్రాణాలను బలిగొన్నాయి. దేశమంతా ఆగ్రహ జ్వాలలు రగిలించిన ఈ విషాదాన్ని స్వాతంత్య్రానంతరం దేశం మరిచిపోయింది. ఇది మరో విషాదం!
1938లో మైసూరు ప్రాంత శివపురాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది. త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు ప్రయత్నించినందుకు ఆ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను జైళ్లకు పంపారు. ప్రతి ఊళ్లో సత్యాగ్రహ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విదురాశ్వత్థలో ఎలాగైనా జెండా సత్యాగ్రహం జరిపి తీరాలని నాయకులు సంకల్పించారు. ఏప్రిల్ 25న జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఉద్యమ జాతర..
విదురాశ్వత్థ.. మైసూరు రాజ్యంలో సరిహద్దు గ్రామం. కర్నాటక రాష్ర్టంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఉంది. విదురాశ్వత్థలో ప్రాచీన ఆలయం వద్ద జరిగే వేడుకల సందర్భంగా జెండా సత్యాగ్రహం చేయాలనుకున్నారు. ప్రజలు ఉదయానికే వేల సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం గుడి వెనుక జెండా ఎగురవేసేందుకు గుమిగూడారు.
ఎట్లా తెలిసిందో? కాసేపట్లో జెండా ఎగురవేస్తారనగా సమాయానికి పోలీస్ బెటాలియన్ వచ్చింది. అయినా ఎవరూ జంకలేదు. జెండా ఎగురవేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, కొత్తగా విధుల్లో చేరిన పోలీస్ ఇన్స్పెక్టర్ కాల్పులకు ఆదేశాలిచ్చాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలైన కాల్పులు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. మహిళలు, వృద్ధుల పట్ల కూడా దయచూపలేదు. ఆ కాల్పుల నుంచి తప్పించుకోలేక తొమ్మిది నెలల గర్భిణి తూటాలకు బలైంది. 96 రౌండ్లు కాల్పులు జరిపారు. 32 మంది మరణించారు. వందమంది గాయపడ్డారు.
ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని ప్రభుత్వం భయపడింది. పది మంది మాత్రమే చనిపోయారని చెప్పింది. రాజ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. విదురాశ్వత్థలో స్వాతంత్య్రం కోసం 32 మంది త్యాగాలు వృథా కానివ్వబోమని గాంధీజీ ప్రకటించారు. జాతీయ కాంగ్రెస్ తరపున వల్లభాయ్ పటేల్, ఆచార్య కృపలానీ విదురాశ్వత్థలో పర్యటించారు. మైసూర్ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మైసూర్ దివాన్ మీర్జా, సర్దార్ పటేల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కాంగ్రెస్ నాయకులకు (స్థానికులకు ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం) కల్పించేలా ఒప్పందం చేసుకున్నారు.