హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కన్కల్ (కంకల్) గ్రామంలో దాదాపు 100 పురాతన శిల్పాలు, ఆలయ విడిభాగాలు ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాయి. నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్న కృష్ణంరాజు సమాచారం మేరకు.. పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కంకల్లో అస్తవ్యస్తంగా ఉన్న శిల్పాలను ఆదివారం పరిశీలించారు. గజకేశ, వీరభద్ర, ఆంజనేయ, పోచమ్మ ఆలయాల సమీపంలో నాగులగడ్డమీద, పంట పొలాల్లోని శిల్పాలు, వీరభద్రాలయం, నమాజుగడ్డ దగ్గరున్న రెండు శాసనాలు.. రాష్ట్ర కూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగరకాలం (క్రీ.శ 9-16 శతాబ్దాలు)కు చెందినవి ఆయన చెప్పారు.
వీరభద్ర, వినాయకులతో ఉన్న సప్తమాతృకలు, జంట నాగదేవతలు, పార్శనాథ జైన విగ్రహం, సింహాలు, ఎనుగులతో అలంకరించిన వర్ధమాన మహావీర శిల్పం భద్రపీఠం, వీరుల శిల్పాలు (వీరగల్లులు), ఆత్మార్పణం చేసుకుంటున్న వీరుల శిల్పాలు ఆనాటి సంప్రదాయాలను వెల్లడిస్తాయని తెలిపారు. 12వ శతాబ్దినాటి భిన్నమైన నంది, రెండు కన్నడ శాసనాలు, 16వ శతాబ్ది నాటి నాగదేవతలు, భైరవ శిల్పం వెయ్యేండ్ల శిల్పకళకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ పీఠాలపై ప్రతిష్ఠించి, పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శివనాగిరెడ్డి, కృష్ణంరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శిల్పాలతో గ్రామస్థాయి పురావస్తు శిల్ప ప్రదర్శనశాలను ఏర్పాటుచేయాలని సర్పంచ్ సంతోషవీరన్న కోరారు.