హనుమకొండ, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు.. పైసల కోసం దందాలు.. ఆ పార్టీ అధికారంలో ఉంటే అంతే. ప్రజల గురించి పట్టించుకోరు. పరిపాలన చెయ్యరు. పదవుల కోసం వాళ్లలో వాళ్లే కొట్లాడుకుంటరు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి’ రాజకీయవర్గాల్లో నిత్యం వినిపించే మాటలివీ. తరాలు మారుతున్నా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటున్నది. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంపై మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విశ్వాసం లేనట్టు కనిపిస్తున్నది. నిత్యం ఎవరో ఒక మంత్రితో ముఖ్యమంత్రికి విభేదాలు, వివాదాలు ఉంటున్నాయి. ఆర్థిక వ్యవహారాలే మంత్రులతో విభేదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సీఎం రేవంత్రెడ్డికి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పుడు మంత్రికి తెలియకుండానే సాగునీటి శాఖలో నేరుగా సీఎం నిర్ణయాలు తీసుకొనే దాకా రావడంతో ఇద్దరి మధ్య అంతరం మరింత పెరిగింది. రేవంత్తో భట్టికి అస్సలు కుదరడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే భట్టిపై ఉద్దేశపూర్వకంగా కమీషన్ల ఆరోపణలు చేయించడం, ఆ తర్వాత పదవుల పంపిణీలో సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రేవంత్కు సొంత జిల్లా మంత్రి జూపల్లికి పొసగడం లేదు. ఎక్సైజ్ శాఖలోని డిస్టిల్లరీ అనుమతుల విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ మొదలైంది. ఇప్పటికీ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి ఆఫీసు నిర్ణయాలు తీసుకుంటుండటంతో జూపల్లి దూరంగా ఉంటున్నారు. మంత్రి కొండా సురేఖతో రేవంత్కు మధ్య నిత్యం పోరు సాగుతున్నది.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మధ్య పంచాయితీ అనేది సహజ వ్యవహారం అనేలా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే కొనసాగుతున్నది. సీఎం రేవంత్రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు మధ్య చాలా అంశాల్లో నెలకొన్న పంచాయితీ తీవ్రమైన విభేదాల వరకు వెళ్లింది. ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు.. ప్రభుత్వంలోని కొన్ని నిర్ణయాలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై పీసీసీ చీఫ్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. సీఎం తీరు ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినందుకు పీసీసీ చీఫ్పై రేవంత్ గుర్రుగా ఉన్నారు.
ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఆధిపత్యం, లావాదేవీల పంచాయితీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సింగరేణి వ్యవహారంలో భట్టి, కోమటిరెడ్డి మధ్య లొల్లి పెద్ద దుమారమే రేపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.
అధికార పార్టీలో కుటుంబ పెద్దగా భావించే సీఎంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం ఉండటం లేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి… నిత్యం సీఎంపై విమర్శలు చేస్తున్నారు. చిన్నారెడ్డి సైతం వనపర్తి టికెట్ కేటాయింపులో ఆర్థిక వ్యవహారాల ప్రస్తావన తేవడంతో పెద్ద చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం సైతం రేవంత్పై విమర్శలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మంత్రి పదవుల విషయంలో సీఎంపై అసంతృప్తితో ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య, వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు, నియోజకవర్గ కీలక నేత, మంత్రి వివేక్ అనుచరుడు జగన్మోహన్రావు మధ్య వర్గపోరు సాగుతున్నది. తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మధ్య పంచాయితీ ఉన్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మందుల సామేల్, ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డి, సామేల్ పరస్ప రం విమర్శలు చేసుకున్నారు. పొంగులేటి మద్దతుతో అసమ్మతి వర్గం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్రెడ్డికి మధ్య వర్గపోరు ఉన్నది.
కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎక్కడా సఖ్యత ఉన్న పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు మంత్రులను తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఆహ్వానించడం అస్సలు జరుగడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, అనిరుధ్రెడ్డి పదేపదే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు అందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పంచాయితీ ఉన్నది.
దాదాపు రెండేండ్లుగా కొండా సురేఖ సొంత నియోజకవర్గంలో తప్పితే ఇతర సెగ్మెంట్లలోని అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో కొండా సురేఖకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. రెండు వర్గాల మధ్య కేసులు, కొట్లాటలు కొనసాగుతున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితోనూ కొండా సురేఖకు మధ్య ఎప్పటి నుంచో అంతరం ఉన్నది. ఉమ్మడి వరంగల్లోని నర్సంపేట, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలతోనూ మంత్రి సురేఖకు పొసగడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మధ్య విభేదాలు ముదిరాయి.