ముషీరాబాద్, ఆగస్టు 30: జీవో 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు.
జీవో97 రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలను మహీంద్రా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీని వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్ కాలేజీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.