హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. నలుగురు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు ఏకంగా విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. అంతా ప్రముఖ వర్సిటీ వీసీలే కావడం గమనార్హం. హైదరాబాద్లోని ఓ వర్సిటీ వీసీ ఈ నెల 17 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.
వర్సిటీ పనులు, ఒప్పందాలు, పూర్వ విద్యార్థులను కలిసే పేరిట వీసీలు విదేశాలకు వెళ్తున్నారు. ఒక వీసీ విదేశీ పర్యటన కోసం ఏకంగా రూ. పది లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీసీలు విదేశాలకు వెళ్లడమేంటన్న సందేహాలొస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి వాడాల్సిన సొమ్మును దుబారా చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గవర్నర్ జోక్యం చేసుకుని దుబారాకు చెక్పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.