హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ విలీన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజీఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గురువారం పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ బస్భవన్ ఎదుట దీక్షకు అనుమతి ఇవ్వకపోగా, సమీపంలోనే దీక్షను ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ శిబిరాన్ని పోలీసులు రణరంగంగా మార్చారు. తమ హక్కుల కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని నినదిస్తున్న కార్మికులను ఈడ్చిపడేశారు. హనుమంతు ముదిరాజ్ సహా ఇతర ఆర్టీసీ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకొని ముషీరాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. నాయకులను చెల్లాచెదురు చేస్తూ వ్యాన్లలోకి విసిరిపడేశారు. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్టు పోలీస్స్టేషన్లోనే హనుమంతు ముదిరాజ్ ప్రకటించారు. విలీనం చేయాలని, ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు ఆపాలని నేతలంతా పెద్దపెట్టున నినదించడంతో స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. హనుమంత్ ముదిరాజ్తో పాటు నాయకులు స్వాములయ్య, బుల్లెట్ పాండు, మురళీకృష్ణ, శంషుద్దీన్, అంజయ్య, జీకే ప్రసాద్, తాండూరు శ్రీను, వేణు తదితర నాయకులు అరెస్టయిన వారిలో ఉన్నారు.
ప్రాణత్యాగానికీ వెనుకాడబోను: హనుమంతు
ఆర్టీసీ విలీనం కోసం తన ప్రాణత్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని హనుమంతు ముదిరాజ్ ప్రకటించారు. విలీన ప్రక్రియ కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘రిలే నిరాహార దీక్షలు’ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆమరణ దీక్షకు దిగిన హనుమంతు ముదిరాజ్తోపాటు టీజీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్యతోపాటు రిలే దీక్షలకు దిగిన ఇతర నేతలను పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ దవాఖానలోనూ నినాదాలు చేశారు. గాంధీ దవాఖానలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విలీన అంశం, సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరగా విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ విలీన అంశం మరో రెండేండ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు
ఆర్టీసీ విలీనం కోరుతూ హనుమంతు ముదిరాజ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్ సుద్దాల సురేశ్, ఎస్టీఎంయూ ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్, జీకే స్వామి, సంపత్ తదితరులు మద్దతు తెలిపారు. పోలీస్స్టేషన్లో ఉండగానే హనుమంతు ముదిరాజ్ ఇతరులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం విలీనంపై సరైన నిర్ణయం తీసుకొని, ఆమరణ దీక్షను విరమింపజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.