కడెం, ఏప్రిల్ 23 : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యాసంగి పంట కాలం ప్రారంభమయ్యే నాటికి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగుల నీరు నిల్వ ఉంచామని, రెండో పంటకు పూర్తిస్థాయి ఆయకట్టు కాకుండా 28వ ఉపకాలువ వరకు 25వేల ఎకరాలకు మాత్రమే కడెం నుంచి నీటి విడుదల చేశామని వెల్లడించారు. పంటకాలం మొత్తానికి నీటిని వదిలినా ప్రాజెక్టులో నీటిమట్టం కనిష్ఠ స్థాయి 675 అడుగులకు తగ్గలేదని చెప్పారు.
ప్రధాన కాలువ, కుడి కాలువకు నీటిని విడుదల చేస్తూ కడెం పరిధిలోని చెరువులను నింపుతున్నా నీటిమట్టం 682.7 అడుగులు ప్రధాన కాలువ బెడ్ లెవల్ కన్నా ఏడు అడుగుల నీటిమట్టం ఎక్కువగా ఉన్నదని వెల్లడించారు. రానున్న వర్షాకాలం నాటికి ప్రాజెక్టు గేట్లకు కొన్ని మరమ్మతులు, ప్రధాన కాలువ గోడ, సాధారణ నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండటంతో గేట్లను కొద్దిగా ఎత్తి పనులు చేస్తున్నామని, ఈ క్రమంలోనే బుధవారం పనుల కోసం గేట్లను ఎత్తడంతో 500-600 క్యూసెక్కుల నీరు బయటికి వెళ్తుందని వెల్లడించారు. నీటిమట్టాన్ని తగ్గిస్తేనే ఈ ఏడాది చేపట్టాల్సిన మరమ్మతులు చేయగలమని, ఇది ప్రతిసారీ జరిగే ప్రక్రియేనని కడెం ప్రాజెక్ట్ డీఈ విశాల్ తెలిపారు. కొందరు కావాలని దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.