హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ బీమా స్కామ్లో రోజుకో విచిత్రం బయటపడుతున్నది. అసలు భవన నిర్మాణ రంగంతో సంబంధంలేని వ్యక్తులకు బీమా సొమ్ము ఇవ్వడం, దరఖాస్తు చేసిన రోజే పరిహారం విడుదల కావడం, అంగవైకల్యం లేకపోయినా శాశ్వత అంగవైకల్యం చెందారంటూ సొమ్ము కాజేసిన దళారుల తీరుపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కార్మిక శాఖ.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులపై వేటు వేసింది. కాగా ఈ స్కామ్లో కొత్తకొత్త విషయాలు బయటపడుతున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే రూ.150 కోట్లకుపైగా సొమ్ము పక్కదారిపట్టిన తీరుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా అధికారులు తూతూమంత్రంగా విచారణను ముగించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఎఫ్ఐఆర్లు లేకున్నా
భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుడి కుటుంబానికి రూ.6,30,037 బీమా పరిహారంగా ఇస్తారు. శాశ్వత అంగవైకల్యం చెందితే బీమా కంపెనీ రూ.4,10,037 చెల్లిస్తుంది. భారీ మొత్తంలో సొమ్ము వస్తుండటంతో కొందరు దళారులు రాజకీయ అండదండతో అసలు భవన నిర్మాణ కార్మికులే కానివారి పేరుతో బీఎల్వో కార్డులు సృష్టించి బీమా సొమ్ము కాజేశారు. బీమా సొమ్ము తీసుకోవాలంటే కచ్చితంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ కచ్చితంగా ఉండాలి. కానీ, ఎక్కడా ఎఫ్ఐఆర్లు లేవు. కొన్ని చోట్ల అదే పేరుతో ఉన్న వేర్వేరు ఎఫ్ఐఆర్లు తెచ్చి జతచేశారు. మరికొన్నిచోట్ల ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కూడా రాయలేదు. ఎఫ్ఐఆర్ నంబర్ కార్మిక శాఖ రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలి. కానీ, మంచిర్యాల జిల్లా పరిధిలో 2025 జూలై 29నుంచి 2026 ఏప్రిల్ 24వరకు మొత్తం 91 బీమా క్లెయిమ్లు చేయగా దీంట్లో ఒకట్రెండు మినహా అన్నింటికీ ఎఫ్ఐఆర్ నంబరే లేదు. కొన్నింటిపై ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా దరఖాస్తులో పేర్లకు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్నదానికి పొంతనే లేదు. ప్రమాదం జరిగిన తేదీలు, క్లెయిమ్ తేదీలకూ పొంతనలేదు.
సొమ్ము ఇతరుల ఖాతాల్లోకి
బీమా సొమ్ము మంజూరైనప్పుడు సాధారణంగా మరణించినవారి కుటుంబసభ్యుల ఖా తాలోకి వెళ్లాలి. భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలి. కానీ, మంచిర్యాల జిల్లాలో 91 కేసుల్లో సుమారు 30కి పైగా క్లెయిమ్లలో సొమ్ము ఇతరులకు వెళ్లింది. తీగల సులోచన (ఏఎల్వోపీఏఆర్కెఎల్/2020/13353) 2024 మార్చి 14న ప్రమాదంలో మరణించారు. ఈమె బీమా సొమ్మును ఈ రాజేశ్, ఇతరుల పేరుతో జమచేశారు. గట్టికొప్పుల శ్రీకాంత్ (ఏఎల్వోడబ్ల్యూజీఎల్ 3/2017/00699) 2020 ఫిబ్రవరి 14న మరణించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. ఆయన బీమా సొమ్మును బంక జ్యోతి, ఇతరుల పేరుతో బదిలీ చేశారు. ఇలా ఇతరుల పేరుతో ఉన్న ఖాతాలకు బీమా సొమ్ము మళ్లించడం నేరం. .
పారదర్శకతే లేదు
బీమా కంపెనీ ఎంపిక నుంచి మొదలు ఇప్పుడు సొమ్ము అందించే అంశం వరకు ఎక్కడా పారదర్శకత లేకుండా పోయింది. మంత్రి, కమిషనర్, బోర్డు సీఈవో ఎవరూ ఈ అంశంపై దృష్టిపెట్టి కార్మికులకు న్యాయం చేయాలన్న ఆలోచన చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వందల కోట్లు పక్కదారిపడితే ఇద్దరు కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. దరఖాస్తుల పరిశీలన అనేదే లేకుండా తెల్లకాగితాలు పెట్టి డబ్బులు దిగమింగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో గమనించవచ్చు.
ఆ శాఖ మంత్రి జిల్లా నుంచే దందా
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి ఇలాకాలోనే బీమా క్లెయిమ్ల దందా జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మంత్రి సొంత జిల్లాలో, ఆయన, ఆయన కొడుకు, ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే దాదాపు రూ.10 కోట్ల మేరకు బీమా సొమ్ము పక్కదారి పట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ.150 కో ట్లపైగా బీమా సొమ్ము దళారుల పాలైనట్టు తె లుస్తున్నది. ఈ వ్యవహారంపై ఇప్పటికీ సంబంధిత శాఖ మంత్రి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. సొమ్ము దిగమింగినవాళ్లలో కాంగ్రెస్కు చెందిన కొందరు నేతలు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణతోనే సరిపెడుతారా?
కోట్లాది సొమ్మును దొంగ, ఫేక్ డాక్యుమెం ట్లు పెట్టి దిగమింగినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కార్మిక శాఖ ఉన్నతాధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇ వ్వలేదు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతోనే ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం. తమ బం డారం బయటపడుతుందని అధికారులు, ము ఖ్యులు భయపడుతున్నట్టు తెలిసింది.
ఇద్దరు అధికారులపై వేటు
కార్మిక శాఖలో బీమా బాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రచురించిన కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీటిపై ‘తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు’ అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరుపుతామంటూ వివరణ ఇచ్చారు. వరంగల్ కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు బోర్డు సీఈవో వెల్లడించారు. ఈ వ్యవహారంలో పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి కార్మికశాఖ అధికారి రఫీ, నోడల్ అధికారి వెంకట రమణపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిసింది. కానీ కార్మిక శాఖ అధికారికంగా ప్రకటించలేదు. ఇద్దర్నీ విధుల నుంచి తప్పించినట్టు సమాచారం.