హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్ కులస్థులను బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 27 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలన్నీ రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ సాధికారిత భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా, ఉపాధి అవకాశాలు పొందాలంటే ముదిరాజ్లను బీసీ ‘ఏ’లో చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘాల నేతలు అల్లాదుర్గం సురేశ్, సలేంద్ర శివయ్య, కొరివి లక్మణ్, బుల్లెట్ వెంకన్న, రవీందర్, దిగంబర్, నగేశ్, సంతోష్కుమార్, ద్యాగల శ్రీనివాస్, భిక్షపతి, సత్యనారాయణ, వెంకటస్వామి, యాదగిరి శ్రీనివాస్, శివయ్య, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.