కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆరెస్సెస్ వారే దాడికి తెగబడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. ‘నిక్కర్’ (ఆరెస్సెస్)లో శిక్షణ పొందిన వారే దీదీపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీపై జరిగినట్టు చెబుతున్న దాడిని హత్యా యత్నంగా మదన్ మిత్రా అభివర్ణిస్తూ ఇలాంటి ఘటన గుజరాత్లో జరిగి ఉంటే మరో గోద్రాలా మారేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు తాను దవాఖానలో కోలుకుంటున్నానని తన మద్దతుదారులు సంయమనం పాటించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని సీఎం మమతా బెనర్జీ ఓ వీడియోలో పేర్కొన్నారు. గతరాత్రి జరిగిన ఘటనలో తనకు తీవ్ర గాయాలయ్యాయని, వైద్యులు తనకు చికిత్స అందిస్తున్నారని రెండు మూడు రోజుల్లో ప్రచార సభల్లో తిరిగి పాల్గొంటానని ఆ వీడియోలో దీదీ వెల్లడించారు. కాగా మమతా బెనర్జీపై దాడి డ్రామాను తృణమూల్ నేతలు తెరపైకి తెచ్చినా ఈ నాటకం రక్తికట్టలేదని బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.