నల్లగొండ: తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రశంసలు అందుకుంటున్నది. ఈ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి వెళ్లేదారిలో ఎల్లమ్మ గుట్ట వద్ద ప్రభుత్వం మిషన్ భగీరథ నీటి సంపును ఏర్పాటు చేసింది.
ఈ నీటి సంపు ద్వారా చందంపేట మండలంలోని చిత్రియాల, బుడ్డోని తండా, కాకునుటి తండా, రేకులగడ్డ, నేరుట్ల తండా, చౌటుట్ల తండా, కంభలాపల్లి, పాత కంభలాపల్లి, పొగిళ్ల తదితర గ్రామాలు, తండాలకు తాగునీరు అందుతున్నది. ఆయా గ్రామాల్లోని నీటి ఎద్దడికి ఈ సంపు నిర్మాణం ద్వారా తెలంగాణ సర్కారు తెరదించింది.