వరంగల్ : పర్వతగిరి శివాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం కనుల పండువలా సాగింది. కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించారు. దాదాపు 850 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ శివాలయం కోసం ఇప్పటికే రూ.5కోట్లకుపైగా ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించారు. రూ.70లక్షలు దేవాదాయశాఖ నుంచి నిధులు మంజూరు కావడంతో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
2023 జనవరి 26న పర్వాతల గుడి శివాలయానికి ప్రారంభోత్సవం చేయనుండగా.. సోమవారం ధ్వజస్తంభ ఆరోహణ చేశారు. అప్పటిలోగా గుట్ట మీద ఆలయానికి కావాల్సిన విద్యుత్, మంచినీటి వసతి, రవాణా, భక్తుల సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కల్లెడ రామ్మోహన్ రావు మంత్రికి వివరించారు. శివాలయం చుట్టుపక్కల ఉన్న దాదాపు 200 గ్రామాల ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శివాలయానికి వచ్చే భక్తులు వాహనాలను నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించనున్నట్లు ధర్మకర్త వివరించారు.