హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చెప్పులు, బూట్లు, బెల్టులు తదితర తోలు ఉత్పత్తుల్లో బ్రాండెడ్కున్న గిరాకీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ బ్రాండ్ల చెప్పుల కనిష్ఠ ధర రూ.1,000కిపైమాటే అంతే అతిశయోక్తి కాదుమరి. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న ఇటువంటి బ్రాండెడ్ ఉత్పత్తులు.. ఇకపై తెలంగాణలోనే తయారయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో లెదర్ క్లస్టర్ను, అలాగే ఆరు జిల్లాల్లో మినీ లెదర్ పార్కులను అందుబాటులోకి తెస్తున్నది.
వీటిల్లో ప్రముఖ కంపెనీలు తమ కర్మాగారాలు ఏర్పాటు చేసేలా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక రంగం సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. అవకాశమున్న వివిధ రంగాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నది తెలిసిందే. ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు తోళ్ల పరిశ్రమపై దృష్టి సారించింది.
సీఎల్ఆర్ఐతో ఒప్పందం
తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎల్ఐపీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆరు మినీ లెదర్ పార్కులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అభివృద్ధి చేసేందుకుగాను చెన్నైలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఎల్ఆర్ఐ)తో అవగాహనా ఒప్పందం(ఎంఓయు) చేసుకున్నారు. స్థానిక కంపెనీలతోపాటు తోళ్ల పరిశ్రమలో కొనసాగుతున్న ప్రముఖ బహుళ జాతి సంస్థలను ఆహ్వానించి ఇక్కడే ప్రముఖ బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ముడి సరుకు లభ్యత, మార్కెట్ అవకాశాలను అంచనా వేసిన అధికారులు.. ఒక్కో పార్కును ఒక్కో ఉత్పత్తికి ప్రత్యేకించాలని నిర్ణయించారు. పాదరక్షలు, గార్మెంట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర తోలుతో తయారయ్యే వస్తువులు ఇక్కడ తయారు చేయాలని నిశ్చయించారు. ఏ పార్కును ఏ ఉత్పత్తికి కేటాయించాలో ఆయా కంపెనీలతో చర్చించిన తరువాత నిర్ణయించనున్నారు. త్వరలోనే ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.
28 ఎకరాల్లో..
కేంద్ర ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద టీఎస్ఎల్ఐపీసీ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 28 ఎకరాల్లో లెదర్ క్లస్టర్ను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం రూ.7.39 కోట్లు భరించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రూ.2.61 కోట్లు విడుదల చేయగా, కేంద్రం రూ.2 కోట్లే విడుదల చేసింది. ఇక ఇందులో 153 ప్లాట్లను అభివృద్ధి చేస్తుండగా, రూ.53 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 1,000, పరోక్షంగా 500 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ప్రస్తుతం బౌండ్రీ నిర్మాణం పూర్తవగా, వచ్చే కంపెనీల అవసరాలకు తగ్గట్టు షెడ్లను నిర్మించాలని నిర్ణయించారు.
‘ఆర్మూర్లో లెదర్ క్లస్టర్కు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మినీ లెదర్ పార్కులలో ప్రస్తుతమున్న షెడ్ల మరమ్మతులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టాం. ఒక్కో పార్కును ఒక్కో విధమైన ఉత్పత్తికి ప్రత్యేకించాలని నిర్ణయించాం. ఎంఎన్సీలను ఆహ్వానించేందుకు సీఎల్ఆర్ఐ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్ల (ఈఓఐ)ను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక కంపెనీలు, ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్నవారిచే యాన్సిలరీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించాం. ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్ల ఉత్పత్తులు రాష్ట్రం నుంచే తయారు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం’
–డీ శ్రీనివాస్ నాయక్,వైస్ చైర్మన్, ఎండీ, టీఎస్ఎల్ఐపీసీ