రూ. 750 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన మలబార్ గ్రూప్
తెలంగాణలో గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ
2500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశం
మలబార్ గ్రూప్కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న మలబార్ గ్రూప్ తెలిపింది. తమ గ్రూప్స్ కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మలబార్ గ్రూప్ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడున్న వ్యాపార అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో పాటు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.