ధర్మారం/రామడుగు/మల్యాల, ఫిబ్రవరి 28: కాళేశ్వరం లింక్-2లో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నంది పంప్హౌస్ మీదుగా ఎగువకు గోదావరి పరవళ్లు పెడుతున్నది. ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్హౌస్లో ఫిబ్రవరి 27న 4, 5 మోటర్లను ఆన్ చేసి జలాలను తరలించిన అధికారులు, విడతల వారీగా మోటర్లను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు. శనివారం 2,5వ మోటర్లను ఆన్ చేయగా 6,300 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్ల ద్వారా నంది రిజర్వాయర్లోకి చేరుతున్నాయి.
అండర్ టన్నెళ్ల ద్వారా అదే పరిమాణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్ హౌస్కు తరలిపోతున్నాయి. 1, 7వ నంబర్ మోటర్లను ప్రారంభించి ఎత్తిపోతలు కొనసాగించారు. డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడుతున్న జలాలు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి ఎస్సారెస్పీ వరదకాలువ 102 కిలోమీటర్ పాయింట్ వద్ద కలుస్తున్నాయి.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఇక్కడి గేట్లను మూసి నీటిని ఎగువకు తరలిస్తున్నారు. శుక్రవారం 0.15 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని, శనివారం 0.30 టీఎంసీల జలాలను తరలించామని వెల్లడించారు. గాయత్రీ పంప్హౌస్ నుంచి తరలివచ్చిన 6,300 క్యూసెక్కుల జలాలు వరద కాలువలో ఎదురెక్కుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన రాంపూర్ పంప్హౌస్కు చేరాయి. ఇక్కడ 3 మోటర్లను ఆన్ చేసి ఒక్కో మోటర్ ద్వారా 1,450 క్యూసెక్కుల చొప్పున 4,350 క్యూసెక్కులు వరదకాలువలో ఎగువకు పంపింగ్ చేశారు. సాయంత్రం ఎత్తిపోతలు నిలిపివేశారు. వరద కాలువపై ఆధారపడి సాగైన పంటలకు నీరందించేందుకే ఎత్తిపోతలు కొనసాగించినట్టు అధికారులు పేర్కొన్నారు.