హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుఖేందర్రెడ్డి కూసుకుంట్లకు ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల అభినందనలు తెలియజేస్తూ పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, టీఆర్ యస్ నాయకులు యామ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిచే ఎమ్మెల్యేగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.