హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : గణపతి తొలి వికాస కేంద్రం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమేనని ప్రముఖ పరిశోధకుడు, డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన రవించిన ‘మూషిక వాహన గజానన, తెలంగాణలో గణపతి పరిణామం’ గ్రంథాన్ని హిమాయత్నగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు రెండు వేల సంవత్సరాల నాటి హాలుని ‘గాథాసప్తశతి’, గుణాఢ్యుని ‘బృహతథ’ వంటి ప్రాచీన సాహిత్య ప్రస్తావనలతో పాటు కృష్ణానదికి ఇరువైపులా లభించిన శిల్పాలు, శాసనాలు, స్థానిక జానపద సంప్రదాయాలను ఈ గ్రంథంలో విశ్లేషించినట్టు తెలిపారు.
గోవింద్ దాస్, డీపీ చటోపాధ్యాయ వంటి పూర్వ పరిశోధకుల సిద్ధాంతాలతోపాటు, తెలుగు నేల నుంచే గణపతి ఆరాధన ఉత్తర భారతదేశానికి, ఇతర ఉపఖండ ప్రాంతాలకు ఎలా విస్తరించిందో ఇందులో ఆధారసహితంగా పొందుపరిచామని వివరించారు. అంతేకాకుండా గణపతి సంప్రదాయాలు బౌద్ధ, జైన మతాల్లోకి ప్రవేశించిన తీరును, తెలుగు ప్రాంత మౌఖిక కథనాల ప్రాధాన్యతను సమన్వయం చేస్తూ చారిత్రక ఆధారాలతో ఈ గ్రంథాన్ని వెలువరించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పండితులు పంచాంగం అజయ్, విజయ్, శ్రీనివాస్, మహేశ్, వినోద్, ప్రతీక్తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.