న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రస్తుతం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సర్’ ప్రక్రియలో తనకు నోటీసు రావడంపై ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. తాను నమోదైన ఓటరునని, ఎంపీగా ఉన్నప్పటికీ తన పౌరసత్వంపై అనుమానం ఉన్న వ్యక్తిగా ఎలా పరిగణించారని నిలదీశారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఓటు పట్నాలో ఉండేదని, 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో తన పేరు అక్కడి జాబితాలో ఉన్నదన్నారు. బూత్ స్థాయి అధికారి వచ్చినప్పుడు అవసరమైన వివరాలన్నీ అందించానని, ఫారమ్పై తన ఫొటోతో పాటు బీఎల్వో సంతకం కూడా ఉన్నదన్నారు. తన ఫోన్ నంబర్ ఎన్నికల అధికారుల వద్ద ఉన్నప్పుడు నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీలో సుమారు 1.45 కోట్ల మంది ఓటర్లలో 63 లక్షల మంది పేర్లు తొలగించారని, దాదాపు 32 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని చెప్పారు.
13.40 లక్షల మంది ‘గత సర్తో మ్యాపింగ్ కాలేదు’ అనే క్యాటగిరీలో ఉన్నారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసం 23 శాతం, వయసులో తేడాలు 6 శాతం కేసులకు కారణమన్నారు. ఎన్నికల సంఘం తన సమస్యను సరిదిద్దగలదని సిబల్ పేర్కొన్నారు. ‘ఈ సారి నేను ఓటు వేయను. ఎన్నికల సంఘం తనను పౌరుడిగా పరిగణించడం లేదని ప్రజలు తెలుసుకోవాలి’ అని కపిల్ సిబల్ అన్నారు.