హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తులను మేనేజ్ చేసి తీర్పు మార్పిస్తా.. సివిల్ సివిల్ కేసును గెలిపిస్తానని రూ.7 కోట్లు తీసుకొని తమను హైకోర్టు సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ మోసం చేశారని, ఆయనకు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అండగా ఉండి బెదిరిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్లో కేసు నమోదైంది. ఈ మేరకు గత నెలలో ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్లో వేదుల వెంకటరమణ, ఎమ్మెల్యే బలాలపై నమోదైన ఈ కేసు తాజాగా సీసీఎస్కు బదిలీ అయింది. సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కుత్బుల్లాపూర్కు చెందిన డాక్టర్ చింతల యాదగిరి 1982లో తమ కమ్యూనిటీ అసోసియేషన్ తరపున మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ గ్రామంలో పొలం కొనుగోలు చేశారు. ఆ పొలాలపై 2005లో వివాదాలు మొదలుకావడంతో, తమ ప్రత్యర్థులపై కేసు వేశారు. తమ కమ్యూనిటీ పెద్దల సూచనలతో సైదాబాద్కు చెందిన హైకోర్టు లాయర్ వేదుల వెంకరమణను నియమించుకున్నారు. మొదట రూ.30 లక్షలు ఫీజు రూపంలో న్యాయవాది వసూలు చేసి, కోర్టు కేసు సరిగ్గా హాజరు కాకుండా కాలయాపన చేస్తూ కేసు తప్పక మనమే గెలుస్తున్నామంటూ చెప్తూ వచ్చారు.
దీనిపై తన కమ్యూనిటీకి చెందిన 10 మంది సభ్యులు అసలు ఈ కేసు గెలుస్తామా? మరో అడ్వకేట్ను మాట్లాడుకోవాలా? అనే విషయంపై చర్చించుకున్నారు. ‘హైకోర్టులో మనకు అనుకూలంగా జడ్జిమెంట్ తెచ్చే బాధ్యత నాది. గతంలోనూ అలాగే చేశాం, మన కేసు వచ్చే బెంచ్ జడ్జీలను మేనేజ్ చేసి మనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుందాం’ అంటూ నమ్మించారు. ఇందుకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడి తరపున వారు చర్చించుకొని చివరకు రూ.7 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. రెండు దఫాలుగా ఆ సొమ్మును నగదు రూపంలోనే న్యాయవాదికి బాధితులు అందజేశారు.
ఈ కేసు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో బాధితులు న్యాయవాదిని నిలదీశారు. కేసు వాదించడంలో చురుకుగా వ్యవహరించకుండా, తమ ప్రత్యర్థులతోనే న్యాయవాది చేతులు కలిపి భారీగా డబ్బు వసూలు చేశావని, అందుకే తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, తాము ఇచ్చిన రూ.7 కోట్లుకు రెట్టింపు రూ.14 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు న్యాయవాదిని నిలదీశారు. తాను తీసుకున్న రూ.7 కోట్లు తిరిగి ఇస్తానంటూ ఒప్పుకొని అందులో కోటి రూపాయాలు తిరిగి ఇచ్చాడు. మిగతా ఇవ్వాలంటే మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో బెదిరింపులు చేస్తున్నాడని, జయకుమార్ అనే వ్యక్తి పాతబస్తీకి చెందిన ఎంఐఎం గుండాలతో బెదిరిస్తూ తమను వెంబడిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని, తమను కులం పేరుతో దూషిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో వేదుల వెంకటరమణ, అమ్మద్ బలాల, జయకుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.