హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కొయినా డ్యామ్ నీళ్ల కోసం మహారా ష్ట్ర సర్కారుతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తున్నది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్న ది. దీనిపై ఎలాంటి స్పష్టత లేకుండా ఎలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మహారాష్ట్రలోని కొయినా డ్యామ్ నుంచి 30 టీఎంసీల నీటిని కోరేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం, అది అనేక వ్యయప్రయాసలతో కూడుకున్నదని అధికారులు నివేదించడం విధితమే. అయినా కొయినా నీళ్ల కోసం ప్రత్యేకంగా మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
శాశ్వత ప్రాతిపదికపై?
కృష్ణా నది ఉపనది కొయినాపై పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ దక్షిణ ప్రాంతంలో కొయినా డ్యామ్ను నిర్మించారు. దీని నీటి నిల్వసామర్థ్యం 105 టీఎంసీలు. అందులో 30 టీఎంసీలను సాగు, తాగునీటి అవసరాల కు కేటాయించుకుకోగా, మరో 67.5 టీఎంసీలను జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి కేటాయించారు.
ఏటా ఆ జలాలతో 4 దశల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అందుకు ట్రిబ్యునల్ -1 కూడా ఆమోదించి మహారాష్ట్రకు రక్షణ కల్పించింది. కృష్ణాబేసిన్లో తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో కొయినా నుంచి జలవిద్యుత్తు ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న జలాలను తూర్పు వైపునకు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలు చేస్తున్నది. ఇప్పటికే కేంద్ర జల్శక్తి శాఖను కూడా సంప్రదించినట్టు విశ్వసనీయ సమాచారం.
స్పష్టత కరువు
జలవిద్యుత్తు ఉత్పత్తి ద్వారా వచ్చే మొత్తానికి సమానమైన కరెంటును, లేదంటే డబ్బు ను అందిస్తామని తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రతిపాదనకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్ర సర్కారు ఎప్పుడంటే అప్పు డు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం కొయినా డ్యామ్ వద్ద ఉన్నది.
ఒక టీఎంసీ నీటితో అత్యధికంగా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నది. మహారాష్ట్రలోని సతారా, సోలాపూర్, సాంగ్లి జి ల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంలో కొయినా డ్యామ్ కీలకపాత్ర పోషిస్తున్నది. ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను మహారాష్ట్ర వదులుకునేందుకు సిద్ధపడుతుందా? అనేది ఒక ప్రశ్న. కొయినా డ్యామ్ నుంచి తెలంగాణ దాదాపు వెయ్యి కిలోమీటర్లకుపైగా దూరం.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్తోపాటు అనేక ఆనకట్టలు, పదుల సంఖ్యలో ఉన్న కేటీ వియర్లను దాటుకొని జలాలు రావాల్సి ఉంటుంది. ఎక్కువ నీరు దారిలోనే నష్టపోవాల్సి ఉంటుంది. కొయినా నుంచి నీటిని తెచ్చినా వాటి విడుదలకు కర్ణాటక ఒప్పుకుంటుందా? అనేది మరో సం దేహం. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టులు.
ఆ రెండు డ్యామ్లలోకి జలాలను తీసుకువస్తే ఏపీ వినియోగించుకోకుండా ఉంటుందా? అంటే అనుమానమే. తమకు లబ్ధి చేకూరుతుందనే కోణంలో కర్ణాటక, ఏపీ అంగీకరించినా తెలంగాణతోపాటుగా పరిహారంగా నిధులను చెల్లిస్తాయా? అనేది మరోప్రశ్న. కొయి నా జలవిద్యుత్తు ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ 1 మొత్తంగా 67.5 టీఎంసీలను కేటాయించగా, ట్రిబ్యునల్ 2 కూడా 65 శాతం డిపెండబులిటీపై 25 టీఎంసీలను కేటాయించింది. ఆ కేటాయింపులను కర్ణాటక, ఏపీ, తెలంగాణ సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్ 2లో సవాల్ చేశాయి.
ఆ అంశంపై విచారణ కొనసాగుతున్నది. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్నా, ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే నీళ్ల కోసం ప్ర తిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కోయినా నీళ్ల కోసం అంతర్గత కమిటీ
కోయినా నుంచి నీళ్ల కోసం మహారాష్ట్రతో సంప్రదింపులకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఒక అంతర్గత కమిటీని ని యమించింది. ఈ కమిటీలో శ్రీధర్రావు దేశ్పాండే, సల్లా విజయ్కుమార్, పీ విజయ్కుమార్ ఉన్నారు. కృష్ణా బేసిన్లో నీటి కొరత దృష్ట్యా ఎగువన మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి విడుదల చేస్తున్న జలాలను దిగువకు విడుదల చేయాలని తెలంగాణ ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.
తాత్కాలికంగానే కాకుండా శాశ్వతంగా ఆ మేరకు ఒప్పందం చేసుకోవాలని యోచిస్తున్నది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాగునీటిశాఖ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారుతో ఆ దిశగా సంప్రదింపులు జరిపేందుకు సాగునీటి పారుదలశాఖ అంతర్రాష్ట్ర జలమండలి అధికారులను ప్రత్యేకంగా నియమించింది.