సువర్ణ వినాయక్
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రాథమికస్థాయి విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని, అప్పుడే విద్యార్థుల్లో సమగ్ర వికాసం జరుగుతుందని ఎస్సీఈఆర్టీ తెలుగు పుస్తకాల కో ఆర్డినేటర్, తెలంగాణలో తప్పనిసరి తెలుగు అమలు కమిటీ సభ్యుడు సువర్ణ వినాయక్ తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన విద్యాకమిషన్లు అన్నీ మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలంటూ పేర్కొన్నాయని చెప్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా న్యూఢిల్లీలో విశ్వపుస్తక మేళా నిర్వహించిన సందర్భంగా మంగళవారం ‘నూతన విద్యావిధానం- మాతృభాషల స్థానం’ అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన సదస్సులో వినాయక్ మాట్లాడుతూ.. మాతృభాషతోనే మేధో వికాసానికి బాటలు పడతాయని తెలిపారు. 2009 విద్యాహక్కు చట్టం ద్వారా మాతృభాషకు చట్టబద్ధత లభించిందని, దేశ భవిష్యత్కు ఉపయోగపడే విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. నూతన విద్యావిధానం మాతృభాషను తప్పనిసరి చేసిందని తెలిపారు. కేంద్రం తెచ్చిన ఎన్పీఈతో పాటు, ఆర్టీఈలు సైతం ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషలోనే బోధన కొనసాగాలని పేర్కొన్నాయని విద్యావేత్త ప్రొఫెసర్ ఉపేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.