హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహించారు.
ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొని డ్రా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు అందించాల్సిన పనిముట్లను ఖరారు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాంత్రీకరణ పథకం కింద అందించే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారుల తో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆయిల్పామ్ సాగు విస్తరణ, ఎరువుల లభ్యత, యూరియా సరఫరా, వ్యవసాయ యాం త్రీకరణ, రైతు వేదికలపై సోలార్ ప్యా నెల్స్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. సమీక్షలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, కో-ఆపరేటివ్ స్పెషల్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హాకా ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.