చాంద్రాయణగుట్ట, జూన్ 16 : భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాలు నిర్వహిస్తామని మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్యాదవ్ మాట్లాడుతూ పాతబస్తీలో ఆగస్టు 1న బోనాలు, 2న అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాతబస్తీ బోనాలకు ముందుగానే జులై 25న సికింద్రాబాద్ బోనాలు జరుగనున్నందున శాలిబండ కాశీ విశ్వనాథస్వామి ఆలయం నుంచి అమ్మవారి ఘటాల ఊరేగింపు, స్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఆలయం తరపున బంగారు బోనం, పట్టు వస్ర్తాలు సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్రావు, వేణుగోపాల్, కార్యదర్శి గాజుల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.