హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదారాబాద్లో ఒక ప్రాంతానికే ఐటీ పరిమితం కాకూడదని, నలుమూలలా విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్తగా గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పర్షన్) పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పాలసీ కింద నగరానికి తూర్పు ప్రాంతంలో ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని గుర్తుచేశారు. ఆదివారం ఉప్పల్లో జెన్ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో 15 వేల మంది కూర్చొని పనిచేసేలా ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని, జెన్ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష మంది పనిచేయవచ్చని కేటీఆర్ వెల్లడించారు. పశ్చిమ హైదరాబాద్కు దీటుగా తూర్పు హైదరాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతున్నదని వివరించారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోల్లో శిల్పారామం ఏర్పాటు చేశామని, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉన్నదని చెప్పారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు, ఉప్పల్ జంక్షన్లోనూ స్కైవాక్ నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి ముందుకొస్తున్న డెవలపర్లకు ప్రభుత్వం మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. జెన్ప్యాక్ట్ వరంగల్లోనూ విస్తరిస్తున్నందుకు కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, జెన్ప్యాక్ట్ అధినేతలు విద్య, సతీశ్, సీఈవో గౌతమ్రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ సీపీ మహేశ్ భాగవత్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.