Keesara | హైదరాబాద్, సెప్టెంబర్ 5 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో ఇన్నాళ్లూ కనిపిస్తున్న ఆ నంది స్తంభాల వెనుక ఇంతటి చరిత్ర ఉందని తెలుసా? శైవక్షేత్రంలో సాధారణ స్మారకాలుగా కనిపించే నాలుగు స్తంభాలు దాదాపు 600 ఏళ్ల క్రితం నాటి వీరుల, వారి భార్యల జ్ఞాపకాలను మోస్తున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో వెలుగుచూసింది. స్తంభాలపై ఉన్న శిల్పాలు, వీరగల్లు, స్త్రీల ప్రతిమలను పరిశీలించిన ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం.. వీటిలో రెండు సతిశిలలు ఉన్నట్లు గుర్తించింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని షాహికమాన్ సమీపంలో రెండు ప్రాంతాల్లో చెరో జత స్తంభాలు కనిపిస్తాయి. ఒక్కో జతకు దీర్ఘచతురస్రాకార వేదికలు నిర్మించారు. ఇప్పటివరకు వీటిని నంది స్తంభాలుగానే స్థానికంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడంతో వాటి వెనుక ఉన్న చారిత్రక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక జత స్తంభాల వద్ద ఉన్న వీరగల్లును పరిశీలించగా అది సతిశిలగా గుర్తించారు. శిలపై ఒక వీరుడు కత్తి, డాలు పట్టుకుని నిల్చున్నట్లు చెక్కారు. అతని వెనుక ఇద్దరు స్త్రీల ప్రతిమలు ఉన్నాయి. వారిలో ఒకరి చేతిలో కమండలం కనిపిస్తుంది.
యుద్ధంలో మరణించిన వీరుడిని అనుసరించి ప్రాణత్యాగం చేసిన ఇద్దరు మహిళలు అతని భార్యలై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వీరుడి అలంకరణ, వీరకాసె, సిగతోపాటు వెనుక ఉన్న స్త్రీల ఆహార్యాన్ని బట్టి ఈ శిల్పం 14, 15వ శతాబ్దాల నాటిదిగా అంచనా వేస్తున్నారు.

Keesara Gutta
ఈ జతలో ఒక స్తంభం పైభాగంలో గుడి విమానం తరహా ఆకృతి ఉండగా.. మరో స్తంభంపై నంది శిల్పం చెక్కి ఉంది. వీటి కింద రాతిపలకలతో దీర్ఘచతురస్రాకార వేదికను నిర్మించారు.
వీరుడు, అతని భార్యల సమాధులను అక్కడే ఏర్పాటు చేసి, వారి జ్ఞాపకార్థం ఈ స్మారక స్తంభాలను నిలిపి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వారు శైవ సంప్రదాయానికి చెందినవారు కావడంతో సమాధుల వద్ద నంది శిలను ప్రతిష్ఠించి ఉండవచ్చని వివరిస్తున్నారు.
రెండో జత స్తంభాలపై కూడా నంది శిల్పాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒక స్తంభం మధ్యభాగంలో వీరుడితోపాటు అతని సతి అర్థశిల్పం చెక్కి ఉంది. దీంతో ఇది కూడా మరో సతిశిలగా పరిశోధకులు గుర్తించారు. ఈ స్తంభాల మధ్యలో బాణలింగాన్ని ప్రతిష్ఠించారు. శైవ సంప్రదాయంలో ఆచార్యులు, ప్రభువులు వంటి గౌరవనీయుల సమాధుల వద్ద నంది శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేదని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు.
కీసరగుట్టలో గుర్తించిన నంది స్తంభాలకు పోలిక ఉన్న స్మారకాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోనూ ఉన్నట్లు ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం తెలిపింది. దీంతో తెలంగాణలోని మధ్యయుగ శైవ సంప్రదాయాలు, వీరుల స్మారకాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను వెలికితీసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
కీసరగుట్టలోని ఈ స్తంభాలు కేవలం రాతి నిర్మాణాలు కాదని.. నాటి సామాజిక, మత, వీర సంప్రదాయాలను తెలియజేసే చారిత్రక ఆధారాలని బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. స్తంభాలపై ఉన్న శిల్పాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి చారిత్రక నేపథ్యాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ క్షేత్ర సందర్శనలో శ్రీరామోజు హరగోపాల్, త్రిభువన విక్రమాదిత్య, నల్ల మధుసూదన్రెడ్డి, రామకృష్ణ, రమేష్, సాయి పాల్గొన్నారు. చారిత్రక వివరణను ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ అందించారు.