Rain | నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వానలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వానలు లేక వాడిపోయిన మెట్టపంటలకు ఊపిరి వచ్చింది. హైదరాబాద్లో ఆదివారం ఉదయం గంటపాటు వాన దంచికొట్టింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 5.5 సెం.మీ, నిర్మల్ జిల్లా సారాంగాపూర్ మండలం బీరవెల్లిలో 5.4 సెం.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ, నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పహాడ్లో 4.3 సెం.మీ వర్షం కురిసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సిరిసిల్లలో పిడుగుపాటుకు యువకుడు దుర్మరణం చెందాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయం త్రం దాకా మోస్తరు వాన పడింది.
వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. సిరిసిల్ల జి ల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెద్దపల్లి జిల్లా వర్షానికి అతలాకులమైంది. సాంకేతిక లోపంతో రోజంతా కరెంటు సరఫరా నిలిచిపోయింది. గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తా రైల్వే వంతెన వద్ద వరద ప్రవాహంలో 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు చిక్కుకోగా, పోలీసులు బస్సును బయటకు తీసుకొచ్చారు. జిల్లాలో అత్యధికంగా సుల్తానాబాద్ మండలంలో 114.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని మంకమ్మతోట, విద్యానగర్, భాగ్యనగర్, సాయినగర్ తదితర ప్రాం తాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామడుగు మండలం తిర్మలాపూర్లో పెంకుటిల్లు కూలిపోయింది. సిరిసిల్ల పట్టణం గణేశ్నగర్కు చెందిన పడి గే సతీశ్(32) అనే బైక్ మోకానిక్ పిడుగు పాటు తో మృతి చెందాడు. స్నేహితులతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతున్నది. మంచిర్యాల జిల్లాలో 9.5 మిల్లీ మీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 17.7 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. కుమ్రంభీం, వట్టివాగు, చెలిమెల ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని మత్తడి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల వాన దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి ఉద యం 8.30 గంటల వరకు బోరబండలో అత్యధికంగా 8.8 సెం.మీ వర్షం పడింది. మూసపేట 7.7 సెం.మీ, జూబ్లీహిల్స్లో 7.4, గచ్చిబౌలిలో 6.2, మాదాపూర్లో 6.0, బంజారాహిల్స్లో 5.4, షేక్పేటలో 5.2, యూసుఫ్గూడలో 5.0, ఖాజాగూడలో 4.8, బాలానగర్, ఖైరతాబాద్లో 4.7, అల్లాపూర్, కూకట్పల్లి, వెస్ట్ మారెడుపల్లిలో 4.5, రాజేంద్రనగర్లో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, అంబర్పేట, ఉప్ప ల్, చార్మినార్, సర్దార్మాల్ ప్రాంతాల్లో మోస్తరు వాన పడినట్టు పేర్కొన్నారు. వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీకి 21 వేల క్యూసెక్కులు వస్తుండగా, ఎల్లంపల్లికి 40 వేల క్యూసెక్కులు వస్తున్నది. ప్రాణహితలో కూడా వరద కొనసాగుతుండగా, లక్ష్మీబరాజ్కు 54 వేల క్యూసెక్కులు, రాజరాజేశ్వర జలాశయానికి 6 వేల క్యూసెక్కులు వస్తున్నది.
హుజూరాబాద్, సెస్టెంబర్ 3: విద్యుత్తు సిబ్బంది నిబద్ధత, సాహసానికి ఈ ఉదం తం నిదర్శనంగా నిలుస్తున్నది. చెరువులో ఈదుకుంటూ వెళ్లి స్తంభంపై మరమ్మతు చే సి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించిన తీ రు పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి సబ్స్టేషన్ నుంచి చెల్పూర్ గ్రామానికి 11 కేవీ విద్యుత్తు లైన్ వెళ్తున్నది. శనివారం అర్ధరాత్రి 11 కేవీ ఎక్స్ప్రెస్ ఫీడర్ లైన్ బ్రేక్డౌన్ అయింది. ఆదివారం ఉదయం చెల్పూర్ చెరువు మధ్యలో స్తంభంపై డిస్క్లు ఫెయిల్ కావడంతో సరఫరా నిలిచిపోయినట్టు గుర్తించారు. మరమ్మతు చేసేందుకు చెల్పూర్ జేఎల్ఎం అంబాల వెంకటేశ్వర్లు, ఏఎల్ఎం మేకమల్ల పరమేశ్, రైతు కాల్వ తిరుపతిరెడ్డి చెరువులో ఈదుకుంటూ వెళ్లారు. వెంకటేశ్వర్లు స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేపట్టగా పరమేశ్, తిరుపతిరెడ్డి చెరువు నీటిలో ఉండి తాళ్లతో సహాయం చేశారు. విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించిన సిబ్బందిని కరీంనగర్ ఎస్ఈ గంగాధర్, అధికారులు అభినందించారు. ఆ ఇద్దరికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.