సిద్దిపేట, జూన్ 25: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తస్కీములేమీ రాలేదని, అన్నీ స్కాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విరుచుకుపడ్డారు. ఈ స్కాముల సర్కార్ పోయి మళ్లీ స్కీముల సర్కార్ రావాలని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని 31నెలలుగా మోసం చేస్తున్న రేవంత్రెడ్డి.. ఒకో అవ్వాతాతలకు, బీడీ కార్మికురాలికి ఏకంగా రూ.62,000 బాకీ పడ్డాడని, అవి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. సర్కార్ దవాఖానలో కాన్పు అయితే కేసీఆర్ కిట్ కింద రూ.12వేలు ఇచ్చి తల్లీబిడ్డను ఇంటి వద్ద దింపే సీమ్ తీసుకొస్తే కాంగ్రెస్ సర్కార్ బంద్ పెట్టిందని మండిపడ్డారు.
మహిళలకు రూ.2,500 ఇస్తామని, కల్యాణలక్ష్మీతో పాటు పెండ్లికి తులం బంగారం ఇస్తామని.. ఇలా అన్నీ మోసాలే చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని కానీ, ఏ పండుగైనా, కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉంటూ మీ ఇంట్లో అన్నదమ్ముల్లా, అకాచెల్లెళ్లలా ఉండేది బీఆర్ఎస్ నాయకులు మాత్రమేనని చెప్పారు.
ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పనిచేయాలన్నారు. ప్రతి ఓటరునూ కలువాలని, ప్రతి గడపనూ తట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ రెండు నెలల పాటు ఉంటుందని, 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకొనేలా అవగాహన కల్పించాలని కోరారు.