1. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ ఫలితం.. నిండుకుండల్లా మారిన ఊరచెరువులు, కట్టలు పటిష్ఠం
2.కాళేశ్వరం కట్టి, గోదావరిని ఒడిసిపట్టి ఎగువకు తరలించిన ఇంజినీరింగ్. ఉత్తర తెలంగాణ చుట్టూ జలవలయం
3.వాగులను నిత్య జలరేఖలుగా ఉంచేలా వందలాది చెక్డ్యాముల నిర్మాణం. ఎక్కడికక్కడ నీటిని దాచుకునే సౌలభ్యం.
4.భూగర్భ జలాల పెంపునకు జలసంరక్షణ చర్యలు. ఫలితంగా 21.45 శాతం మేరకు భూగర్భ జలాల వృద్ధి
5.నిరంతర విద్యుత్తుతో పంటలకు సాగునీరు పుష్కలం. ఉచిత విద్యుత్తుతో రైతు పచ్చగా, పంటలు పచ్చగా..
వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఎక్కడా ఒక్క మొక్క ఎండలేదు. ఒక్క చెరువు వట్టిపోలేదు. కాలం ఎటమటమైనా రైతుకు రందిలేదు. మొగులు వైపో, చినుకు కోసమో చూడాల్సిన అగత్యం లేదు. ప్రతి మడికీ తడి అందుతుందన్న ధైర్యం వారిది. అంతకుమించి కేసీఆర్ ఉన్నడన్న భరోసా వారిది. కరువునేలను జలసీమగా మార్చిన ‘పంచ’తంత్రానికి పబ్బతి పడుతున్న పచ్చని పొలాలే సాక్ష్యాలు.
ఈ ఏడు కాలంగాలె. అయినా తెలంగాణలో ఎక్కడా ఓ మొక్క ఎండలే.. ఎక్కడా అన్నదాత మొగులు మొకం చూడలే. అయ్యో నీళ్లెట్ల అని ఆగంగాలె. ఆనందంగా అరకగట్టి.. దుక్కిదున్ని.. నాట్లేసిండు. బోర్లు నిండుగా ధారెత్తి పోస్తుండటంతో ఫుల్ జోష్తో పసిడిపంటల సాగుబాటపట్టిండు. ఇంతకుముందు కాలం కొంచెం ఎటమటమైతే చాలు రైతుల చూపులన్నీ మొగులువైపే. వానజాడ కోసం ఎదురుచూడాల్సిందే. చినుకు పడుతుందా? పడదా?..అదో అంతర్మథనం. పంట చేతికొచ్చేవరకూ గుండెనిండా గుబులు. కానీ, సీఎం కేసీఆర్ విజన్తో స్వరాష్ట్రంలో సాగురీతి మారిపోయింది. తెలంగాణ సర్కారు అనుసరించిన ‘పంచ’తంత్రంతో రైతన్నల రందివాసింది. మిషన్ కాకతీయ, చెక్డ్యామ్ల నిర్మాణం, చెరువులతో ప్రాజెక్టుల అనుసంధానం, తెలంగాణకు హరితహారం, 24 గంటల కరెంట్తో తెలంగాణలో సాగు సంబురమైంది. భూగర్భ జలాలు పైకి ఉబికిరావడంతో ఏటేటా పంటల సాగు పెరుగుతూ.. తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం పచ్చని మాగాణ అయ్యింది.
Telangana | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి. మిషన్కాకతీయ పథకం ద్వారా తొలుత చెరువులను పునరుద్ధరించడం, ఆపై ప్రాజెక్టులతో వాటిని అనుసంధానించడం, చెక్డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టడం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తుండటంతో రాష్ట్రంలో నలుచెరుగులా జలఊటలు జాలువారుతున్నాయి. కరువు నేలల్లోనూ జలసవ్వడులు మురిపిస్తున్నాయి. అదేసమయంలో సమృద్ధిగా వర్షాలు కూడా కురుస్తుండటంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో రైతాంగం నిర్భయంగా సాగుపనులకు శ్రీకారం చుడుతున్నది.
తెలంగాణ ప్రాంత నీటి వనరులకు ఆయువుపట్టయిన చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా తెలంగాణ సర్కారు మిషన్కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 46,500 చెరువులను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇప్పటికే నాలుగు దశల్లో 21,436 చెరువులను పునరుద్ధరించింది. నీటిని ఒడిసిపట్టేందుకు, వృథాను అరికట్టేందుకు వీలుగా వాటిని తీర్చిదిద్దించింది. మరమ్మతులు చేపట్టి, కొత్త తూములను నిర్మించింది. ఫలితంగా మొత్తంగా 15.05 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగుకిందకు వచ్చాయి. ఇక చెరువుల్లోనే 8.42 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. అనంతరం చెరువులను రాష్ట్రంలోని మేజర్, మీడియం ప్రాజెక్టులతో అనుసంధానించారు. ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. ఫలితంగా చెరువులు నిత్యం నిండుగా ఉండడంతోపాటు వాటి పరిధిలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ నివేదికలే తెలియజేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం పీఠభూమి ప్రాంతం కావడం వల్ల మిగతా ప్రాంతాల మాదిరిగా ఒకసారి ప్రవహిస్తూ కిందకు వెళ్లిన నీటిని (పడవాటి నీళ్లు) తిరిగి వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుందని, ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచుకోవడమే ఉత్తమమని నిపుణులు ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నారు. అందుకు వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణమే ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. అయినప్పటికీ ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. కానీ, స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చెక్డ్యామ్లపై దృష్టిని సారించింది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు 1,200 చెక్డ్యామ్లను రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. వాగుల పునరుజ్జీవ పథకం ఫేజ్-1లో కృష్ణ బేసిన్లోని వాగులపై 188, గోదావరి బేసిన్ పరిధిలోని వాగులపై 444 చెక్డ్యామ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవన్నీ దాదాపు తుదిదశకు చేరుకోగా, ఇటీవలే రెండో దశలో మరో 285 చెక్డ్యామ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, చెక్డ్యామ్లు నిర్మించిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. వీటి ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీటికి ఢోకా లేకుండా పోయిందని తెలుపుతున్నారు. చెక్డ్యామ్లు నిర్మించిన చోట నీరు నిల్వ ఉండటంతోపాటు స్థానిక మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధి కూడా పొందుతున్నారని ఇంజినీర్లు చెప్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను రికార్డు సమయంలో పూర్తిచేయడంతోపాటు గత ప్రభుత్వాల హయాంలో దశాబ్దాల తరబడి అసంపూర్తిగా మిగిలిన, అర్ధాంతరంగా అటకెక్కిన ప్రాజెక్టులను సైతం పునఃప్రారంభించి పూర్తి చేస్తూ వస్తున్నది. ఆయా ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రంలో నలుదిశలా కొత్త రిజర్వాయర్లు, కాలువలు, బరాజ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కాళేశ్వరంలో భాగంగా భారీ నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మిడ్మానేరు, ఎల్లంపల్లి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టులే నిదర్శనం. ఆయా ప్రాజెక్టుల్లోకి నీటి నిల్వ ప్రారంభం కావడంతో వాటి పరిధిలో కూడా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తంగా 3 బరాజ్లను నిర్మించింది. 15 రిజర్వాయర్లను నిర్మిస్తున్నది. మొత్తంగా వాటి స్టోరేజీ కెపాసిటీ 141 టీఎంసీలు కాగా, ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లో నీటినిల్వ కూడా ప్రారంభమైంది ఆయా జలాశయాల పరిధిలో చెరువులు ఏడాది పొడవునా నిండుకుండలా తొణికిసాలాడటమేకాకుండా భూగర్భజలాలు కూడా ఇంతకు ముందుకంటే అత్యధికంగా పెరుగుతుండటం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో వాతావరణంలో తేమశాతం కూడా పెరిగిపోయింది. జీవావరణ వ్యవస్థలో అటవీ సంపద, నీటి వనరులే అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం సాగు, తాగు నీటి వసతినే కాదు రాష్ట్ర సహజ జీవావరణ వ్యవస్థలోనూ గణనీయమైన మార్పును తీసుకువస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం పరోక్షంగా అందుకు ఆయువును పోస్తున్నది. చల్లదనాన్ని నింపుతూ సహజ జీవావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నది. ముఖ్యంగా గాలిలో తేమను పెంచుతున్నది. తత్ఫలితంగా అది హైడ్రోలాజికల్ సర్కిల్కు ఊతమిస్తున్నది. ఇది సమృద్ధిగా వర్షాలు కురవడానికి దోహదపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటికే 31 జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం మేరకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన రెండు జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవడం విశేషం. మొత్తంగా జూలై 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదు కావాల్సిన వర్షపాతం 359 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటికే 559 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సమగ్ర జలసంరక్షణ విధానాలతో రాష్ట్రం జలకళను సంతరించుకున్నది. ఆయకట్టు కొత్త జీవం పోసుకున్నది. రైతాంగానికి రెండు పంటలకు భరోసా లభించింది. ప్రాజెక్టుల కింద ఉన్న చివరి మడి వరకు సాగునీరు అందుతున్నది. అంతేకాదు భూగర్భజలాలు గణనీయంగా పెరగడంతో ప్రాజెక్టుల ద్వారానే కాకుండా బోరు బావుల కింద కూడా వ్యవసాయం పెరుగుతున్నది. కావాల్సినన్ని నీళ్లు.. 24 గంటల ఉచిత విద్యుత్తుతో తెలంగాణ రైతాంగం నిరందిగా ఎవుసం చేస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు నాటికి 18 లక్షల పంపుసెట్లు ఉండగా, ప్రస్తుతం అవి సుమారు 25 లక్షలకు పెరగడమే నిదర్శనంగా నిలుస్తున్నది. అందుబాటులోకి వచ్చిన భూగర్భజలాల వినియోగానికి అవి సూచికలుగా నిలుస్తున్నాయి.
చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, కొత్త జలాశయాలు అందుబాటులోకి రావడం, మరోవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 15-20 మీటర్లు ఉండగా నేడు 6 మీటర్లకు పడిపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలు సేఫ్ జోన్ జాబితాలో చేరాయి. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం 4.34 మీటర్లకు పెరిగిందని భూగర్భజలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వర్షపాతం ద్వారానే కాకుండా ఇతర జలసంరక్షణ చర్యల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 21.45 శాతం మేరకు భూగర్భజలాలు పెరిగాయి. ఈ అంశంలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉండటం గర్వకారణం. కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిన నివేదికనే భూగర్భజలాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నది. కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ అవతరణ నాటికి భూగర్భ జలా ల లభ్యత 10-20 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉండేదో తెలిసిపోతున్నది. పూర్తిగా రెడ్, ఆరెంజ్ జోన్లలోనే ఉన్న దుస్థితి. కానీ నేడు ఆ జిల్లాలో డార్ జోన్ లేదా ఆరెంజ్ జోన్ కింద ఎలాంటి ప్రాంతం లేకుండా పోయిందంటే ఏస్థాయిలో భూగర్భజలాలు వృద్ధి చెందాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భూగర్భ జలమట్టం 7.56 మీటర్లుగా నమోదవడం మరో ఉదాహరణ.