ఆదిలాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తెరిపించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జిల్లాలో రోజురోజుకూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బాధితులతో కూడిన సీసీఐ సాధన కమిటీ గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. అనంత రం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. వీరికి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీఐని తెరిపించాలని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కోరినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర తీరును నిరసిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తామని సీసీఐ సాధన కమిటీ సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తే, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తిచేసినా ప్రయోజనం లేకుం డా పోయిందన్నారు. 2015నుంచి కేంద్రంలోని మంత్రులను కలిసి సీసీఐని తెరిపించాలని కోరు తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.