హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ రాయితీకి సంబంధి రూ.374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.298 కోట్లు వైద్య ఆరోగ్యశాఖకు, విద్యుత్ సబ్సిడీ రూ.996 కోట్లు, సమక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు, వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు.
కాగా, బాధ్యతలు స్వీకరించిన భట్టికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరితతోపాటు పలువురు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం సందర్భంగా జరిగిన హోమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు (Duddilla Sridhar Babu), ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా, రెవిన్యూ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) బాధ్యతలు స్వీకరించారు. 33 జిల్లాల డీపీఆర్ఓలకు అధునాతన కెమెరాలు అందించే ఫైల్పై సంతకం చేశారు.