హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన వేణు సంకోజు ప్రతిష్ఠాత్మక దాశరథి అవార్డ్డుకు ఎంపికయ్యారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన నాటితరం తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య పేరిట ఏటా ఇచ్చే అవార్డును ఈసారి వేణు సంకోజుకు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. అవార్డు కింద రూ.1,01,116 (ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు) నగదు పారితోషికంతోపాటు జ్ఞాపికను బహూకరిస్తారు. ఈ నెల 22న అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ, అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. వేణు సంకోజు 1972 నుంచి కవితలు రాస్తున్నారు. 1984లో జయమిత్ర పేరుతో సాహిత్య సాంస్కృతిక వేదికను స్థాపించిన వేణు 1995లో తొలి కవితా సంపుటి ‘మనిషిగా పూచే మట్టి’ ని ప్రచురించారు. ఈ గ్రంథాన్ని ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు. ఆ తరువాత మనం, నేలకల, ప్రాణప్రదమైన కవితా సంపుటులు వెలువడ్డాయి. స్పర్శ శీర్షికన కథల సంపుటిని కూడా వేణు ప్రచురించారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో వేణు సంకోజు క్రియాశీలంగా పాల్గొన్నారు.