హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ధ్రువపత్రాలు అందజేశారు. వీరి నామినేషన్లతోపాటు దాఖలైన మరో రెండు తిరస్కరణకు గురవటంతో ఇద్దరూ ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని పేర్కొన్నారు. అతిగొప్ప అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తన అభ్యర్థితాన్ని బలపరచిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్ఎస్ నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తానని చెప్పారు. తనపై విశ్వాసంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టడానికి సర్వదా ప్రయత్నిస్తానని రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు పేర్కొన్నారు. ‘రాజ్యసభ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసిన అపర భగీరథుడు, కారణజన్ముడు, తెలంగాణ కర్త, అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి మార్గదర్శనంలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో నిరంతరం కృషి చేస్తా. సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాల అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తా. టీఆర్ఎస్ సైనికుడిలా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ఉడతాభక్తిగా నా వంతు పాత్ర పోషిస్తా’అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్కుమార్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.