హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణలో దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం బాల నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా భూమి, ఇల్లు, ఉపాధి అనే మూడు ప్రాథమిక హకుల చుట్టూ సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరారు.
భూమిలేని దళిత కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ, మిగులు, అసైన్డ్ భూములను పంపిణీ చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో దళితులకు స్పష్టమైన ప్రాధాన్యత, పారదర్శక ఎంపిక ఉండాలని సూచించారు. దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ కొనుగోళ్లల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు పూర్తిగా దళితుల అభివృద్ధికే ఖర్చయ్యేలా చట్టబద్ధ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.