హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు మంగళవారం ధాన్యం కొనుగోలుపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. తాలు, తరుగుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు.. తమ ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోలు జరపాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు, తరలింపులో లారీలు హామాలీల కొరత లేకుండా వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఏర్పడినా అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు కమిషనర్ సూచించారు. తాలు, తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతోపాటు ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్లోని ఫౌరసరఫరాల భవన్లో 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుకుగా సాగుతున్నదని తెలిపారు. నిరుడు ఇదే సమయానికి 16.66 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 25.35 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు వివరించారు. నిరుడి కంటే ఈ సారి సుమారు 8.69 లక్షల టన్నులు అధికంగా కొనుగోలు చేశామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 3.34 లక్షల టన్నులను బాయిల్డ్ మిల్లులకు కేటాయించామని పేర్కొన్నారు.