సైబర్ మోసంపై బ్యాంకులో ఫిర్యాదు చేయాలా? పోలీస్ స్టేషన్లోనా? సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలా? బ్యాంకు పరిధిలోని స్టేషనా లేదా వ్యక్తి చిరునామా పరిధిలోని స్టేషనా? సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులను వెంటాడుతున్న ప్రశ్నలివి. కానీ, ఇకపై ఆ సందేహాలొద్దు. 24 గంటల్లో ఏ క్షణమైనా నేరుగా 155260 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్చేస్తే చాలు. నిమిషాల్లోనే కేసు దర్యాప్తు ప్రారంభమవుతుంది. మోసపోయిన వెంటనే స్పందిస్తే పోయిన డబ్బు కూడా తిరిగొచ్చే అవకాశం మెండు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్నం అన్న తేడాలేదు. చదువుకున్నా, సదువు రాదన్న వ్యత్యాసం లేదు. చిన్నా,పెద్దా అన్నట్టు వయసుతో సంబంధమే లేదు. అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి. అందరి ముఖాలు అందులోకే చూ స్తున్నాయి. అందుకే సైబర్ నేరగాళ్ల లక్ష్యం కూడా స్మార్ట్ఫోన్ వినియోగదారులే అవుతున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అందుకే బాధితులకు సకాలంలో సాయం అందించేందుకు 24 గంటలపాటు పోలీస్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. సైబర్ నేరాలకు సంబంధించిన ఏ ఫిర్యాదు అయినా.. ఏ సమయంలోనైనా 155260 నంబర్కు కాల్ చేయవచ్చు. వెంటనే పోలీసుల నుంచి తగిన సాయం అందుతుంది.
24 గంటల్లో ఫిర్యాదు చేస్తే డబ్బు వాపస్
ఆన్లైన్ మోసగాళ్లు మన డబ్బులు కొట్టేసినట్టు తెలిసిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ (ఫోన్పే.. గూగుల్పే.. పేటీ ఎం వంటి) ద్వారా జరిపే లావాదేవీల్లో మన బ్యాంకు నుంచి డబ్బు అవతలి ఖాతాకు జమయ్యేందుకు 24గంటల సమయం ఉం టుంది. ఆ లోపు మనం హెల్ప్లైన్ కాల్చేసి ఫిర్యాదు చేయాలి. ఆ వెంటనే సైబర్ క్రైం పోలీసులు సమాచారాన్ని మన బ్యాంకుశాఖతోపాటు అవతలి కంపెనీకి పంపుతారు. అది ఫ్రాడ్ ట్రాన్జాంక్షన్ అని నిర్ధారించుకుంటే మన డబ్బులు మనకు వాపస్ వస్తాయి. ఇదంతా 24 గంటలలోపే జరగాలి. లేదంటే దర్యాప్తులో చిక్కులు తప్పవు.
ఆన్లైన్లో డబ్బు పోగొట్టుకున్నోళ్లే ఎక్కువ
సైబర్ నేరాల కట్టడిలో భాగంగా కేంద్ర హోం శాఖ, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ల ఆధ్వర్యంలో ఈ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రాష్ట్ర పోలీస్ శాఖకు దీనిలో ఒక డ్యాష్బోర్డు ఉం టుంది. దీనిద్వారా ఆయా రాష్ర్టాల పరిధిలో ని బాధితులు 155260కు డయల్ చేయగా నే స్పందించేలా తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో ఓ ప్రత్యేక విభా గం ఇందుకోసం పనిచేస్తుంది. 24 గంటలపాటు సిబ్బంది ఈ కాల్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఆన్లైన్లో మోసాలు, డబ్బులు కొట్టేయడం, ఆన్లైన్ వేధింపులు ఇలా ఏదైనా కాల్ సెంటర్లో ఫిర్యాదు చే యొచ్చు. నేరుగా సెంట్రల్ సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు నమోదవుతుంది. ఆన్లైన్లో ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి, వారి పరిధిలోని సైబర్ నేరాల దర్యాప్తు అధికారుల ఫోన్ నంబర్లు ఇలా అన్ని రకాల సమాచారం బాధితులకు అందిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 25 నుంచి 30 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.