బోస్టన్: హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్ ఇన్నోవేషన్-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్.. మంత్రి కేటీఆర్కు ఈ మేరకు హామీఇచ్చారు. హైదరాబాద్కు, బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ తరహాలోనే బోస్టన్లో కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చార్లీ బేకర్ పేర్కొన్నారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు.
బోస్టన్లో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని, తద్వారా అక్కడి పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నయన్న విషయాన్ని బేకర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు.

ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బయో లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపత్యంలో హైదరాబాద్లో ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణలో కూడా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో హెల్త్ రికార్డ్లను డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతమున్న లైఫ్సైన్సెస్ రంగంలోని సైంటిస్టులతోపాటు ఐటీ, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషితో రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు.